Jallikattu: జల్లికట్టు.. వెన్నులో వణుకు: కుమ్మేసిన ఎద్దు: ఒకరి ప్రాణం బలి.. పలువురికి గాయాలు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే జల్లుకట్టు ఈవెంట్ ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారంతా 20 నుంచి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారే. ఈ ఘటనతో జల్లికట్టును తాత్కాలికంగా నిలిపివేశారు పోలీసులు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారంటూ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం తరలించారు.
జిల్లాలోని రామకుప్పం మండలంలోని పెద బల్లూరు గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి పేరు అబ్దుల్ భాషా. జల్లికట్టు సందర్భంగా దూసుకొస్తోన్న ఎద్దును ఆపడానికి ప్రయత్నించాడు అబ్దుల్ భాషా. అది కాస్త పట్టు తప్పింది. ఎద్దు కొమ్ములు తగిలి అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని 108 అంబులెన్స్లో కుప్పం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఎద్దు పొడవడంతో మెడ, ఛాతీ దగ్గర తీవ్ర గాయాలు కొమ్ముల గుర్తులు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే రామకుప్పం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా జల్లికట్టును నిర్వహించకూడదంటూ రోజూ ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నామని, అయినప్పటికీ.. తమ ప్రయత్నాలను మానుకోవట్లేదని పోలీసులు చెప్పారు. నిర్వాహకులపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని చెప్పారు. సంక్రాంతి పండుగ ముగిసేంత వరకూ జల్లికట్టును నిర్వహించకుండా చర్యలు తీసుకుంటున్నామని, నిఘాను మరింత ముమ్మరం చేస్తామని అన్నారు.
జల్లికట్టు.. వెన్నులో వణుకు: కుమ్మేసిన ఎద్దు: ఒకరి ప్రాణం బలి.. పలువురికి గాయాలు#Tamilnadu #Jallikattu pic.twitter.com/8lX5wZzHjh
— Oneindia Telugu (@oneindiatelugu) January 12, 2020
తమిళనాడు తరహాలోనే చిత్తూరు జిల్లాలో కూడా ఏటేటా సంక్రాంతి పండుగ సందర్భంగా జల్లికట్టును నిర్వహిస్తుంటారు. దీనికి జిల్లా పోలీసులు, గానీ పాలనా యంత్రాంగం నుంచి గానీ అనుమతులు ఉండవు. అయినప్పటికీ.. తమ వినోదం కోసం గ్రామీణ యువకులు జల్లికట్టును నిర్వహిస్తుంటారు. జల్లికట్టులో పెద్ద ఎత్తున పందాలను సైతం కాస్తుంటారు. కోనసీమలో కోడి పందాల తరహాలోనే చిత్తూరు జిల్లాలో జల్లికట్టు ఈవెంట్ సందర్భంగా లక్షల రూపాయల మేర పందాలు తెగుతుంటాయి.