జగన్ ఇలాకాలో బాబు వ్యూహాలు : టీడీపీలోకి దేవగుడి ఫ్యామిలీ - జమ్మలమడుగు ఇన్ ఛార్జ్ గా భూపేశ్రెడ్డి..!!
ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాకాలో టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా కడప జిల్లాలో కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గం లో దేవగుడి ఫ్యామిలీని టీడీపీలోకి చేర్చుకోవాలని నిర్ణయించారు. దీని పైన కొంత కాలంగా మధనం జరుగుతున్నా..ఈ రోజున దీని పైన అధికారికంగా నిర్ణయం ప్రకటించారు. దేవగుడి వర్గం మొదట కాంగ్రెస్లో.. తర్వాత వైసీపీలో ఉంది. దేవగుడి వర్గం తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలో చేరి మంత్రి అయ్యారు.
టీడీపీలోకి దేవగుడి నారాయణరెడ్డి ఫ్యామిలీ
2014 లో ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ..టీడీపీలో మంత్రి అవ్వటంతో పాటుగా జగన్ పైన పలు సందర్భాల్లో ఆరోపణలు చేసారు. ఇక, 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ అభ్యర్ధి సుధీర్ కుమార్ రెడ్డి గెలుపొందారు. జమ్మలమడుగులో దేవగుడి వర్గం, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య సుదీర్ఘకాలంగా ఫ్యాక్షన్ నెలకొంది. రామసుబ్బారెడ్డి వర్గం టీడీపీలో ఉండగా దేవగుడి వర్గం మొదట కాంగ్రెస్లో.. తర్వాత వైసీపీలో ఉంది. అయితే, 2019 ఎన్నికల తరువాత ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. అప్పటికే టీడీపీలో వీరిద్దరి మధ్య రాజీ ఫార్ములాలో భాగంగా ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా..రామసుబ్బారెడ్డి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించారు.
జమ్మలమడుగులో టీడీపీకి కొత్త ఇన్ ఛార్జ్
2019 ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. ప్రధాన వర్గాలు రెండూ బయటకు వెళ్లిపోవడంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అస్థవ్యస్థంగా మారింది. కాని రెండేళ్లలో ఈ నియోజకవర్గంలో కొత్త పరిణామాలు చోటు చేసుకొన్నాయి. దేవగుడి వర్గంలో చీలిక వచ్చింది. ఆ వర్గంలో ప్రధాన నేత అయిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి టీడీపీ వైపు మొగ్గు చూపారు. జిల్లా నేతల అభిప్రాయాలు తీసుకొన్న తర్వాత ఆయన కుమారుడు భూపేశ్కు నియోజకవర్గ ఇన్చార్జి పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.
అదినారాయణ రెడ్డి వ్యూహంలో భాగమా
ఈనెల 20న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నామని మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ప్రకటించారు. తాను, తన కుమారుడు భూపేశ్రెడ్డి టీడీపీ కండువాలు కప్పుకోబోతున్నామని చెప్పారు. జమ్మలమడుగులో టీడీపీకి మళ్లీ పూర్వవైభవం తెస్తామని నారాయణరెడ్డి ప్రకటించారు. అదే విధంగా మైదుకూరు లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన డీఎల్ రవంద్రారెడ్డితోనూ టీడీపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, ఆ నియోజకవర్గం నుంచి టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుటుంబం ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది. డీఎల్ ను పార్టీలోకి వస్తే ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చే అవకాశాలు లేవని చెబుతున్నారు.
Recommended Video
డీఎల్ రూటు ఎటు..
కానీ, అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రాధాన్యత కల్పిస్తామని చెబుతున్నట్లుగా తెలుస్తోంది.అయితే, జమ్మలమడుగులో ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి మద్దతు..సూచనలతోనే ఆయన సోదరుడు..కుటుంబం టీడీపీలో చేరుతుందనే ప్రచారం ఉంది. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నా..భవిష్యత్ లో రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా టీడీపీలోకి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. అందులో భాగంగానే..ముందుగా నియోజకవర్గంలో పార్టీ పరంగా పట్టు కోసమే ఆదినారాయణ రెడ్డి సోదరుడు కుటుంబం టీడీపీలో చేరుతుందనే వాదన వినిపిస్తోంది.