జగన్-చంద్రబాబుకు చెక్: 2024కంటే ముందే జమిలి ఎన్నికలు -జనసేనదే అధికారం: పవన్ కల్యాణ్
జనసేన పార్టీ సభ్యత్వలు తీసుకుంటే గనుక ఆ వ్యక్తులకు ప్రభుత్వ పథకాలు నిలిపేస్తామని జగన్ నియమించిన వాలంటీర్లు బెదిరిస్తున్నారని.. అయినాసరే జనసేనానిపై నమ్మకంతో ధైర్యంగా ముందుకు సాగుతున్నామని జనసైనికులు తెలిపారు. బుధవారం మంగళరిగిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో రెండో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమ ప్రక్రియపై నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కార్యకర్తలు పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకురాగా.. అటు వైసీపీ, ఇటు టీడీపీలను ఉద్దేశించి జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు..
నిమ్మగడ్డ రాజీనామా -జగన్ ఫర్మానా -ఏపీలో ఆర్టికల్ 356 -సుప్రీం తీర్పు ఇదే: ఎంపీ రఘురామ
జనసేన ప్రశ్నిస్తుంటే..
రాష్ట్ర విభజన వల్ల ఏపీ ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని, వారికి న్యాయం చేసేందుకే 2014లో జనసేన పార్టీ పెట్టానని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని నాడు చెప్పిన స్లోగన్ అప్పటి కాలానికి సరైందేనని, అయితే, జనసేన ప్రశ్నిస్తూ కూర్చుంటే, మిగతా పార్టీలు అధికారం అనుభవించడానికే పుట్టుకొచ్చినవి కాదని, అధికారంలోకి వచ్చి ప్రజల తరఫున నిలబడటానికే జనసేన పుట్టిందని పవన్ స్పష్టం చేశారు. జగన్ పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలు లేవని జనసేనాని సూత్రీకరించారు..
2024లోపే జమిలి ఎన్నికలు..
జమిలి ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకొచ్చిన సమాచారం ప్రకారం దేశంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చని పవన్ జోస్యం చెప్పారు. 2024 కంటే ముందే జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు రావాలన్నది తన అభిప్రాయమని స్పష్టం చేశారు. చాలా రాష్ట్రాలు కూడా ఇదే కోరుకుంటున్నాయని జనసేనాని తెలిపారు. ఇటీవల టీడీపీ చీఫ్ చంద్రబాబు కూడా దేశంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చని వ్యాఖ్యానించడం తెలిసిందే. అయితే..
చంద్రబాబుకు ముఖం లేదు..
రాజధాని రైతుల పోరాటం నుంచి మొదలుపెడితే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇవాళ జగన్ పాలనలో ఇబ్బందులు పడుతున్నారని, క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీలకు ఇవాళ ప్రజల్లోకి వెళ్లి పోరాడే ముఖంలేదని, ఒక్క జనసైనికులు మాత్రమే.. అధికార వైసీపీ నుంచి బెదిరింపులు వచ్చినా, ఒత్తిళ్లు వచ్చినా, ధైర్యంగా కాలర్ ఎత్తి నిలబడుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. 2024 కంటే ముందే జరగనున్న జమిలి ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావడం తథ్యమని పవన్ చెప్పారు. ‘‘ప్రశ్నిస్తాం.. అధికారంలోకి వస్తాం..''అని కొత్త నినాదం ఇచ్చారాయన.
గడ్డాలు పట్టుకొని బతిమాలను..
‘‘పార్టీలో కొందరికే ప్రాధాన్యం ఇస్తున్నారని సోషల్ మీడియాలో చాలా మంది ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. నాయకులు నచ్చకపోతే మాకు హేతుబద్ధతతో తెలియజేయండి. అంతేకానీ, ఎవరికి నచ్చినట్లు వాళ్లు పార్టీ నాయకుల గురించి మాట్లాడుతామంటే కుదరదు. వంద మంది పార్టీని వీడినా నేను బెదిరిపోను. వెయ్యిమంది జనసైనికుల్ని తయారు చేసుకునే సత్తా ఉందినాకు. గడ్డాలు పుచ్చుకుని బతిమాలడం లాంటివి ఉండవు. రాజకీయాలు నాకు సరదాకాదు.. బాధ్యత. పార్టీలో చేరకుండా బయటి నుంచి కామెంట్లు చేసేవాళ్లను పట్టించుకోవద్దు. మీకు ఇష్టమైతే పార్టీలో చేరండి. ఇక్కన పవన్ కల్యాణ్ అనే వ్యక్తి కంటే జనసేన అనే గుర్తింపే చాలా ముఖ్యం అని అందరూ గుర్తుంచుకోండి'' అని పవన్ కల్యాణ్ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. అటు ఏపీలో అధికారంలోకి వస్తామంటోన్న జనసేన పార్టీ ఇటు తెలంగాణ, హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పోటీచేస్తుండటం తెలిసిందే.
నిమ్మగడ్డ వెనుకడుగు -గవర్నర్తో భేటీ తర్వాత - కలెక్టర్ల కాన్ఫరెన్స్ రద్దు -మళ్లీ హైకోర్టుకు ఎస్ఈసీ?