మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డిపై కేసు నమోదు, వైసీపీ నేతల దాడి నేపథ్యంలో..
మాజీమంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలపై దాడి ఘటనలో కేసు పెట్టినట్టు జమ్మలమడుగు పోలీసులు తెలిపారు. దేవగుడిలో రోడ్డుపై ఉండగా.. తమను ఆది నారాయణరెడ్డి అనుచరులు లోపలికి తీసుకెళ్లి మరీ దాడి చేశారని పేర్కొన్నారు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఆదినారాయణ, ఇతరులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
శనివారం రాత్రి దేవగుడిలో ప్రధాన రోడ్డుపై ఉన్న తమను ఆది నారాయణరెడ్డి అనుచరులు అతని వద్దకు తీసుకెళ్లారని వైసీపీ నేతలు ఎం రెడ్డయ్య, ఆయన సోదరుడు రామాంజనేయులు తెలిపారు. అక్కడ ఆది నారాయణ రెడ్డి సహా ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, దేవగుడి జయరామిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి సహా మరో 80 మంది వరకు ఉన్నారని పేర్కొన్నారు.
అక్కడ తమపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఫిర్యాదులో తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ రెడ్డయ్యను ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెడ్డయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు జమ్మలమడుగు అర్బన్ సీఐ మధుసూదన్ రావు ఆదివారం రాత్రి మీడియాకు వివరించారు.
Recommended Video
వైసీసీ నేతలపై దాడిచేసిన ఆది నారాయణ రెడ్డి అండ్ కోను అరెస్ట్ చేయాలని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదివారం డిమాండ్ చేశారు. జమ్మలమడుగు పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన కూడా తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న రెడ్డయ్య ఫిర్యాదు.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిమాండ్తో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు.