కాశ్మీర్లో ఉగ్రదాడి, 17 మంది మృతి: సాయంత్రం కొవ్వత్తులు వెలిగించాాలన్న పల్లె
అనంతపురం: జమ్ము కాశ్మీర్లోని యూరీ సెక్టారులో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17 మంది సైనికుల మృతికి సంతాపంగా ఆదివారం సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించాలని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రోజు మంత్రి పల్లె పుట్టిన రోజు.
జన్మదినం సందర్భంగా వేడుకలు నిర్వహించుకునే సమయంలో పదిహేడు మంది రైతులు మృతి సైనికులు మృతి చెందారనే విషయం తెలియడంతో ఆయన తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. అనంతరం జవాన్ల మృతికి సంతాపం తెలిపారు. సాయంత్రం ప్రజలు కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలపాలని ప్రజలను కోరారు.
కాగా, జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. భద్రతా బలగాలే లక్ష్యంగా బారాముల్లా జిల్లాలోని సరిహద్దు ప్రాంతం యురి సెక్టార్లో గల సైనిక కార్యాలయంపై ఆదివారం తెల్లవారుజామున కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భారత సైన్యం దాడిని సమర్థంగా తిప్పికొట్టింది.
గంటల పాటు కొనసాగిన భీకర కాల్పుల్లో పదిహేడు మంది సైనికులు వీరమరణం పొందారు. అనంతరం దాడికి పాల్పడిన నలుగురు ముష్కరులను సైన్యం హతమార్చింది. సైనిక కేంద్రాలపై ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలోనే ఈ దాడి జరగడం గమనార్హం.
ఇదిలా ఉండగా, గాయపడ్డ సైనికులను శ్రీనగర్లోని 92 బేస్ ఆసుపత్రికి తరలించారు. దాదాపు ఇరవై మంది వరకు గాయపడ్డారు. యూరి దాడి నేపథ్యంలో అన్ని విమానాశ్రయాలలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ దాడి విషయమై ప్రధాని మోడీకి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరించారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ అజిత్ దోవల్ కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు.
మరోవైపు యీరి దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. సరిహద్దుకు చేరువలో అత్యంత చేరువగా ఈ ఆర్మీ కేంద్రం ఉంది. బలూచిస్తాన్ స్వాతంత్ర్య ఉద్యమానికి భారత్ మద్దతి ఇవ్వడం నచ్చక పాక్ ఈ విధంగా భారత్ను అస్థిరపరిచే కుట్ర చేస్తోందని అంటున్నారు. కాశ్మీర్లో దాడి జరిగే అవకాశముందని బెలూచిస్తాన్ నేత ఒకరు హెచ్చరించిన కొద్ది రోజులకే ఈ దాడి జరిగింది.