ఫ్యాన్స్తో భేటీ: మౌనం వీడనున్న పవన్ కళ్యాణ్
హైదరాబాద్: విశాఖపట్నం సభ తర్వాత మౌనంగా ఉంటూ వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనం వీడే అవకాశాలున్నాయి. ఆయన మూడో సభను ఎక్కడ పెడుతారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన బిజెపికి ప్రచారం చేయడానికి సన్నద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం తన అభిమానులతో సమావేశమయ్యారు. అభిమానుల అభిప్రాయాలను తీసుకుని ఆయన ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతంలోనూ, సమీంధ్రాలోనూ బీజీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ బిజెపి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. ''కాంగ్రెస్ హటావో దేశ్ బచావో'' నినాదాన్ని ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి పూర్తి మద్దతు ప్రకటించిన వియషం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ తొలుత కర్నాటకలో తమ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని, ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో బిజెపి - టిడిపి కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తారని కిషన్ రెడ్డి చెప్పారు. పవన్ కళ్యాణ్, జన సేన పార్టీ ఆవిర్భావ సభలోనూ, విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన బహిరంగ సభలోనూ నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అవుతారని చెప్పడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ను బిజెపి పార్టీ ప్రచారానికి వాడుకోవడానికి రంగం సిద్ధంచేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి బిజెపి తరపున కర్ణాటకలో వవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే ఆంధ్రా, తెలంగాణ రెండు ప్రాంతాల్లోనూ పవన్ ప్రచారం చేయనున్నట్టు సమాచారం. రోడ్షోలు, బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలుస్తోంది.