సిఎం కిరణ్పై దుమ్మెత్తిపోసిన జానారెడ్డి, శ్రీధర్ బాబు
సిఎం తీర్మానం అర్థం లేనిది, విలువలేనిదని జానారెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చ ముగిసిపోయినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఆర్టికల్ 3 ప్రకారం సభలో అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని తాము ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని రెండు ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారని, నాయకులు తమ వ్యాఖ్యలతో ఇంకా గందరగోళం సృష్టించొద్దని కోరారు.
అనివార్యమైన రాష్ట్ర విభజనను అడ్డుకోకుండా.. సీమాంధ్ర నాయకులు కేంద్రం నిర్ణయాన్ని గౌరవించాలని సూచించారు. తమ ప్రాంత ప్రజల సమస్యలను సభలో చర్చించివుంటే బాగుండేదని సీమాంధ్ర ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్లమెంటులో సీమాంధ్ర సభ్యులు తమ ప్రాంత సమస్యలను వివరించాలని సూచించారు.
తెలంగాణ ప్రజలు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు తెలియజేస్తున్నట్లు తెలిపారు. సంయమనం పాటించి మనం ఆశించిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సిఎం తీర్మానం ఎందుకూ పనికిరాదు: శ్రీధర్ బాబు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఎందుకూ పనికి రాదని రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వారం రోజుల్లో పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టడం తథ్యమని, తెలంగాణ రావడమూ తథ్యమని ఆయన అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. సిఎం తీర్మానం ప్రభుత్వ తీర్మానం కాదని, దాన్ని పరిగణలోకి తీసుకోవద్దని స్పీకర్ను కోరినట్లు ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లుగా తెలంగాణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర శాసనసభ నుంచి వెళ్లిన ముసాయిదా బిల్లును వారంలోగా పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతుందని శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ ముగిసిందని స్పీకర్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బిల్లుకు పార్లమెంటు ఆమోదం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన చెప్పారు.