కెసిఆర్కు జానా లేఖ: సునీతా లక్ష్మారెడ్డి ధీమా
హైదరాబాద్: మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు భద్రత కుదించడాన్ని ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి తప్పు పట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తిరిగి సమీక్షించుకోవాలని కోరుతూ ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు బుధవారంనాడు లేఖ రాశారు. సంఘ విద్రోహ శక్తులు, అదివాదుల నుంచి పలువురు నేతలకు ముప్పు ఉందని తెలిపినా భద్రతను తగ్గించడం సరి కాదని ఆయన అన్నారు.
మాజీ మంత్రులు బస్వరాజు సారయ్య, షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఎంపీ సుఖేందర్ రెడ్డి కూడా భద్రత తగ్గింపుపై ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు లేఖ రాశారని వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తమకు ముప్పు ఉందంటూ దరఖాస్తు చేసుకున్న ఎంతో మందికి భద్రత కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మెదక్ లోక్సభ ఉప ఎన్నికలో తనదే విజయమని కాంగ్రెసు పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మూడు నెలల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు మేలు జరింగేమీ లేదని ఆమె బుధవారంనాడు మీడియాతో అన్నారు. రైతులు కరువు కాటకాలతో బాధపడుతున్న ప్రభుత్వం ఆదుకోవడం లేదని, ఆత్మహత్యలు చేసుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం స్పందించడంలేదని ఆమె విమర్శించారు.
తెలంగాణ ప్రజలు విసిగిపోయిఉన్నారని, మార్పు కోరుకుంటున్నారని ఆమె అన్నారు. ఇంత తొందరగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఏదీ లేదని, తెలంగాణ ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తారని ఆమె అన్నారు. ప్రజలు సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తారని సునీతా లక్ష్మారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు
మెదక్ లోక్సభకు జరిగే ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు గుణపాఠం చెపుతారని తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జోస్యం చెప్పారు. మెదక్ లోక్సభ ఉప ఎన్నికలో విజయం సాధిస్తామని ఆయన బుధవారం మీడియా వద్ద ధీమా వ్యక్తం చేస్తోంది.
ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తప్పక ఆదరిస్తారని, అధికారంలో ఉన్న పార్టీకి గుణపాఠం చెప్పేలా ఫలితాలు వస్తాయన్నారు. పార్టీ మెదక్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డితో కలసి హైదరాబాదులో తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా, తనను మెదక్ లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పార్టీ అధిష్టానానికి సునీత కృతజ్ఞతలు తెలిపారు.