Jana Sena: లాంగ్మార్చ్కు బదులుగా: కాస్సేపట్లో అమరావతి గ్రామల్లో జనసేన-బీజేపీ టూర్..!
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు, ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు నిరసనగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉద్యమించనున్నారు. మూడు రాజధానులను ఏర్పాటుకు నిరసనగా నెలన్నర రోజులుగా అమరావతి ప్రాంత రైతులు కొనసాగిస్తోన్న నిరసన దీక్షలు, ఆందోళనలకు మద్దతుగా వారు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ఈ పర్యటన ఆరంభం కానుంది.
తొలుత హాయ్ల్యాండ్లో భేటీ
తొలుత ఈ రెండు పార్టీల సీనియర్ నాయకులు గుంటూరు జిల్లాలోని హాయ్ల్యాండ్లో సమావేశమౌతారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఆ పార్టీ నాయకులు డాక్టర్ల పంచకర్ల సందీప్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు వంటి సీనియర్ నాయకులు ఈ భేటీ హాజరవుతారు. హాయ్ల్యాండ్లో ఉదయం 9 గంటలకు ఈ సమావేశం ఆరంభమౌతుంది.
కార్యాచరణ ప్రణాళికపై
సుమారు గంట పాటు ఈ భేటీ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి గ్రామాల పర్యటనకు సంబంధించిన ఉద్యమాన్ని ఎలా? ఏ రూపంలో ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చిస్తారని, భవిష్యత్లో చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళిక, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలనే విషయాలపై ఓ నిర్ణయానికి వస్తారని చెబుతున్నారు. అనంతరం రాజధాని గ్రామాల పర్యటనకు బయలుదేరి వెళ్తారు.
లాంగ్మార్చ్ను సాధారణ పర్యటనగా
నిజానికి- అమరావతి ప్రాంత రైతుల ఉద్యమాలకు నిరసనగా జనసేన పార్టీ, బీజేపీ నాయకులు ఇదివరకే రాజధాని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నప్పటికీ.. అది సాధ్యం కాలేదు. వాయిదా పడింది. ఇదే రోజు లాంగ్మార్చ్ నిర్వహించాలని ఇదివరకే నిర్ణయించుకున్నారు. తాడేపల్లి నుంచి విజయవాడ వరకూ లాంగ్మార్చ్ నిర్వహించాలని భావించారు. లాంగ్మార్చ్ కుదరకపోవడంతో.. దీన్ని సాధారణ పర్యటనగా బదలాయించారు.
తొలిదశలో మూడు గ్రామాల్లో..
హాయ్ల్యాండ్లో భేటీ ముగిసిన అనంతరం అక్కడి నుంచి నేరుగా మందడం గ్రామానికి బయలుదేరి వెళ్తారు. తొలివిడత పర్యటనలో మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాలను చేర్చారు. ఈ మూడు గ్రామాల్లో జనసేన-బీజేపీ నేతల పర్యటన కొనసాగుతుంది. ఈ మూడు చోట్ల కూడా బహిరంగ సభలను నిర్వహించాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరును ఎండగట్టాలని నిర్ణయించారు. రోడ్షో, రైతులతో ముఖాముఖి భేటీ కావడం వంటి కార్యక్రమాలను చేపడతారు.