చల్లారని రామతీర్థం వేడి: రూటు మార్చిన జనసేన: పోరాట కమిటీ తెరమీదికి: సోము వీర్రాజు డైరెక్షన్లో
విజయనగరం: రాష్ట్ర రాజకీయాలకు హాట్స్పాట్గా మారిన విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థం ఉదంతం చల్లారట్లేదు. రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై జగన్ సర్కార్ సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినప్పటికీ.. ఇందులో ఎలాంటి పురోగతి కనిపించట్లేదని భారతీయ జనతా పార్టీ, జనసేన భావిస్తున్నాయి. ఈ ఘటన నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ప్రభుత్వం నామమాత్రంగా సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిందని అనుమానిస్తున్నాయి.
బాంబు పేల్చిన ఉత్తర కొరియా నియంత: జో బిడెన్కు వార్నింగ్: అణ్వాయుధాలు రెట్టింపు అందుకే
ఈ ఘటనలో నిందితులపై చట్టపరంగా తక్షణ చర్యలను తీసుుకోవాలని, దర్యాప్తును వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తోంది జనసేన పార్టీ. దర్యాప్తు వేగవంతం చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావడానికి జనసేన పార్టీ కొత్తగా ఓ కమిటీని నియమించింది. రామతీర్థం పోరాట కమిటీగా నామకరణం చేసింది. నలుగురు సభ్యులతో కూడిన ఈ పోరాట కమిటీ.. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు సారథ్యంలో పనిచేస్తందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పీ హరిప్రసాద్ పేర్కొన్నారు.
ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీకి.. పార్టీ ప్రధాన కార్యదర్శి టీ శివశంకర్ వహిస్తారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పాలవలస యశస్విని, ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీ సభ్యులు డగసాల అప్పారావు, డాక్టర్ బొడ్డేపల్లి రఘును ఈ కమిటీలోకి తీసుకున్నారు. రామతీర్థంలో రాములవారి విగ్రహానికి అపచారం జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, దర్యాప్తులో పురోగతి లేదని జనసేన పార్టీ పేర్కొంది.
ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావాలనే ఉద్దేశంతోనే ఈ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపింది. రామతీర్థం ఉదంతంపై దర్యాప్తు సాగిస్తోన్న సీఐడీ అధికారులకు ప్రభుత్వం ఎలాంటి స్వేచ్ఛను ఇవ్వట్లేదని తాము అనుమానిస్తున్నామని, అందుకే సత్వర న్యాయాన్ని కోరుతూ ఈ కమిటీ ప్రభుత్వంపై అన్ని విధాలుగా ఒత్తిడిని తీసుకొస్తుందని పేర్కొన్నారు. జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ ఈ కమిటీ తన తదుపరి కార్యాచరణ ప్రణాళికను వెల్లడిస్తుందని స్పష్టం చేసింది.