పవన్ కళ్యాణ్ ‘జనసేన’కు ఈసీ గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి లేఖ పంపించింది.
సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్ సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన గుర్తింపు పొందిన పార్టీగా నిలిచి, గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకొంది.

కాగా, జనసేన పార్టీని ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ 2014లో స్థాపించారు. అప్పుడు జరిగిన ఎన్నికలలో జనసేన నేరుగా పోటీ చేయకుండా ఇతర పార్టీల(తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల)కు మద్దతిచ్చింది. దీంతో 2014లో టీడీపీ, బీజేపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది.
ఆ తర్వాత 2019 ఎన్నికలలో పోటీ చేసిన జనసేన ఒక సీటు గెలుచుకుంది. అయితే, ఆ ఎమ్మెల్యే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో జనసేన పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిథ్యం లేకుండా పోయింది.
ఇక, 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుపొంది రికార్డ్ సాధించింది. రెండు పార్లమెంట్ స్థానాలను కూడా దక్కించుకుంది. కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. తాజాగా, ఎన్నికల సంఘం గుర్తింపు లభించడంతో జనసేన నేతలు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications