ఏమైందో తెలియాలి: ఓటేసిన పవన్ కళ్యాణ్, ఈవీఎం ధ్వంసం.. జనసేన అభ్యర్థి అరెస్ట్! ఏం జరిగిందంటే?
అనంతపురం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. ఏపీలో లోకసభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ విజయవాడలోని పటమటలో ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓటరుపై కొడాలి నాని దౌర్జన్యం?, కారణమిదేనా?: చంద్రబాబు సంచలనంపై వైసీపీ
ఈవీఎంల మొరాయింపుపై పవన్ కళ్యాణ్ అసహనం
అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఎన్నికలు సజావుగా సాగాలని ఆకాంక్షించారు. చాలా ఈవీఎంలు పని చేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. దాదాపు 200 ఈవీఎంలు పని చేయడం లేదని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఒక శాతం రెండు శాతం ఈవీఎంలు పని చేయకుంటే ఏదో అనుకోవచ్చునని, కానీ ఏకంగా పది శాతానికి పైగా ఈవీఎంలు పని చేయకపోవడం ఏమిటని వ్యాఖ్యానించారు. ఓ పార్టీకి ఓటు వేస్తే మరో పార్టీకి వెళ్లడే ఏమిటన్నారు. ఈ విషయమై ఈసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
గుత్తిలో పార్టీ నేత ఈవీఎం డ్యామేజ్ చేయడంపై జనసేనాని
అనంతపురం జిల్లా గుత్తిలో జనసేన పార్టీ అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను ధ్వంసం చేయడంపై పవన్ స్పందించారు. అలా చేయడం సరికాదని జనసేనాని చెప్పారు. అయితే వాస్తవంగా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా వ్యాఖ్యానించడం సరికాదని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియకుండా తాను మాట్లాడనని చెప్పారు. సడన్గా ఓ మాట అనలేమన్నారు. అసలు ఆ మిషన్ను ఎవరు డ్యామేజ్ చేశారో తెలుసుకోవాలని చెప్పారు.
ఈవీఎం ఎత్తేసిన మధుసూదన్ గుప్తా.. ఏం జరిగిందంటే
గుత్తిలో జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను డ్యామేజ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అతను ఓ పోలింగ్ బూత్లో ఈవీఎంను కిందపడేసినట్లుగా వీడియో ఉంది. అయితే జనసేన అభ్యర్థి అయిన మధుసూదన్ గుప్తా.. పోలింగ్ బూత్లో పోలింగ్ అధికారులు పారదర్శకంగా పని చేయడం లేదని, ఓ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పోలింగ్ స్టాఫ్ వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అభ్యర్థి ఆగ్రహం వ్యక్తం చేశారని పోలీసులు చెప్పినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. పోలింగ్ సిబ్బంది.. అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని అందరి అభ్యర్థుల పేర్లు సరిగా డిస్ప్లే చేయడం లేదని మధుసూదన్ గుప్తాకు ఆగ్రహం వచ్చిందని, దీంతో అతను ఈవీఎంను ఎత్తి ప్లోర్ పైన పడేశారని పోలీసులు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.