ఇబ్బందిపెట్టొద్దు, ఈ తల్లి సెంటిమెంట్తో చావగొట్టొద్దు!: తల్లికి చేతులు జోడించి పవన్ కళ్యాణ్!!
కాకినాడ: అవినీతిని నిర్మూలించడం, అవినీతిని పటాపంచలు చేయడం, అవినీతిని తరిమికొట్టడం.. అవినీతిని బద్దలు కొట్టి, ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్థామని ధీమా వ్యక్తం చేశారు. కానిస్టేబుల్స్, ప్రతి ఉద్యోగి, ప్రతి టీచర్, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి.. ఇలా అందరూ రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తున్నారని, కానీ రాజకీయ నాయకులు ఏం చేశారని ఇంత సంపాదన వచ్చిందని ప్రశ్నించారు.
భారీ మెజార్టీ ఖాయమా?: అందుకే కూకట్పల్లి బరిలో నందమూరి సుహాసిని, బాబుతో 20ని.లు భేటీ
నాయకులు వేల కోట్లు దోచుకొని, మళ్లీ ఆ డబ్బుతోనే మన జీవితాలను తొక్కేస్తున్నారని మండిపడ్డారు. ఈ దోపిడీ ఇంకెంతకాలమని ప్రశ్నించారు. ఈ అవినీతిని ఎంతకాలం భరిద్దామన్నారు. వీరు మారుతారేమోనని చూద్దామనుకుంటే.. మారటం లేదని, వీరికి మారేతత్వం, మారేబుద్ధి లేదని విమర్శించారు. ఓ తుఫాన్లా ఈ అవినీతి రాజకీయ నాయకులను సమూలంగా తరిమి కొడదామన్నారు. సమసమాజాన్ని నిర్మిద్దామన్నారు.
తల్లి సెంటిమెంటుతో నన్ను చావగొట్టవద్దని మా అమ్మకు చెప్పా
సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ జవాబుదారీతనం కలిగిన వ్యవస్థను తీసుకు వద్దామని పవన్ అన్నారు. మనకు రాజకీయాలు ఎందుకని తన తల్లి తనతో చెప్పారని, కానీ అప్పుడు నేను మా అమ్మకు ఒకటే మాట చెప్పానని, నీ కొడుకు బాగుండాలి, మిగతా బిడ్డలు చనిపోవాలా అమ్మా.. అని ప్రశ్నించానని, అవసరమైతే నేను చస్తానని చెప్పానని అన్నారు. నా దేశం కోసం, నా సమాజం కోసం, నా తెలుగుజాతి కోసం, మన కోసం.. నీ బిడ్డలను త్యాగం చేయాలని, నన్ను అడ్డుకోవద్దని, నన్ను ఇబ్బంది పెట్టవద్దని, ఈ తల్లి సెంటిమెంటుతో నన్ను చావగొట్టవద్దని రెండు చేతులు జోడించి తన తల్లికి విజ్ఞప్తి చేశానని, నా పట్టున తనను వదిలేయమని చెప్పానని పవన్ చెప్పారు.
మా వాళ్లవి దిగువ మధ్య తరగతి కుటుంబాలు
2003లో తన తల్లితో నేను గొడవ పెట్టుకుంటే, 2018లో తన తల్లి తనకు అనుమతి ఇచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పటికీ పేదరికం ఉందని, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని అని చెప్పారు. ఈ రోజుకు నా పెదనాన్నగారి పిల్లలు ఓ చిన్నపాటి కూరగాయల కొట్టు నడుపుకునే కుటుంబం అన్నారు. ఎక్కడో నెల్లూరులో చిన్నపాటి టిఫిన్ సెంటర్ నడుపుకునే కుటుంబాలు తమవి అన్నారు. చిన్న కూల్ డ్రింక్స్ షాప్ పెట్టుకునే కుటుంబాలు, చిన్న ఉద్యోగాలు చేసే కుటుంబాలు అన్నారు. మా బంధువులు, మా కుటుంబ సభ్యులు అందరూ దిగువ మధ్యతరగతి కుటుంబీకులు అన్నారు. అందుకే అందరి బాధను అర్థం చేసుకోగలనని చెప్పారు.
జగన్, చంద్రబాబు అవసరం లేదు
పాతిక కేజీల బియ్యం ఇచ్చేందుకు నేను జనసేన పార్టీ పెట్టలేదని, మీకు బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు పార్టీ పెట్టానని పవన్ చెప్పారు. మీకోసం నిలబడే వాడిని నేను అన్నారు. మనకు ఏ జగన్ అవసరం లేదని, ఏ చంద్రబాబు అవసరం లేదని, ఇక లోకేష్ అయితే మనకు వద్దే వద్దు అన్నారు. నేను తప్పు చేస్తే, రేపు పొద్దున మన పాలనలో తప్పులు ఉంటే నా చొక్కా పట్టుకొని నిలదీయవచ్చునని చెప్పారు. మీకు ఆ హక్కు ఉందని చెప్పారు. నేను ముఖ్యమంత్రిలా మాటలు మార్చే వ్యక్తిని కాదని, ఊసరవెల్లిలా రంగులు మార్చానని చెప్పారు.
ఓటమి వస్తే అదే ఆలోచిస్తా
2013 భూసేకరణ చట్టం ప్రకారం తాము భూమిని సేకరిస్తామని పవన్ చెప్పారు. ప్రజలు టీడీపీ మాయలో పడినా, వైసీపీ నాయకులకు అండగా ఉన్నా వారు మీ భూములు లాక్కుంటారని, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సీఎం సీఎం అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కారని, నేను సీఎం కావాలంటే మీ ఓటు అనే ఆయుధాన్ని జనసేన పార్టీకి వేయాలని చెప్పారు. అవినీతిరహిత పాలన నేను తీసుకు వస్తానని చెప్పారు. మీరు ఓటు వేయకుంటేనే ఇంతలా చేస్తున్నానని, మీరు ఓటు వేస్తే ఎలా వేస్తానో చూడండని చెప్పారు. నేను జీవితంలో చాలా కష్టాలు చూసినవాడినని, దెబ్బలు తిన్నవాడినని, దశాబ్దం పాటు ఓటమి చూసినవాడినని, అథఃపాతాళానికి వెళ్లిన వాడినని చెప్పారు. కానీ అలాంటి సమయంలో ఒక్కటే ఆలోచిస్తానని రాహువు ఒక్కసారి పడితే లోకబాంధవుడు సూర్యుడు అసలే కనిపించకుండా పోతాడా, మూర్ఖుడు గడియారంలోని ముల్లు కదలనీయకుంటే భూమి తలకిందులవుతుందా అని ఆలోచిస్తానని చెప్పారు. కష్టాలు వచ్చినప్పుడు బలంగా ఉండాలన్నారు. మార్పును కోరుకోవాలని, మువ్వన్నెల జెండా చూసినప్పుడల్లా మీ రోమాలు నిక్కబొడుచుకోవాలని చెప్పారు. చంద్రబాబు, జగన్ భారత్ మాతాకీ జై అనరని విమర్శించారు. జాతీయ జెండాను మోసే నైతిక బలం వారికి లేదని, జనసేనకు ఉందని చెప్పారు. అవినీతి కోటలు బద్దలయ్యేలా, ఢిల్లీ కోటలు బద్దలయ్యేలా, కాంగ్రెస్ కోటలు బీటలు వారేలా, టీడీపీ సమూనంగా పోయేలా, వైసీపీ పారిపోయాలా ఒక్కసారి భారత్ మాతాకి జై కొడదామని పవన్ అందరితో నినాదం చేయించారు.