బీజేపీనే జనసేనతో కలిసింది.. అధికారంపై ఆశ లేదు.. ఆధార్ కార్డులాంటిలే ఎన్ఆర్సీ: పవన్ కామెంట్స్
దేశ ప్రయోజనాల కోసం పాటుపడే తత్వం, జాతినిర్మాణానికి అవసరమైన భావజాలం జనసేనకు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ అంశాలను అర్థం చేసుకున్న తర్వాత జాతీయ పార్టీ బీజేపీనే జనసేనతో కలిసి నడవాలని నిర్ణయించుకుందని, ఆ మేరకే పొత్తుపెట్టుకున్నామని వివరించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ముస్లిం సముదాయాలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీపైనా కీలక కామెంట్లు చేశారు.
జనసేనకూ ఆర్ఎస్ఎస్ లాంటి వ్యవస్థ
సంఘ్ పరివార్ లో భాగంగా ఉండే బీజేపీకి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు సహకారిగా పనిచేస్తుంటాయని, బీజేపీకి ఆర్ఎస్ఎస్ లాగే జనసేనకు కూడా అలాంటి వ్యవస్థనే ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్ని వైపుల నుంచి సలహాలు వస్తున్నాయని పవన్ చెప్పారు. బీజేపీ, జనసేన పార్టీల్లో జాతీయవాద భావాలు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ ఆర్ఎస్ఎస్ లాంటి వ్యవస్థ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
ప్రజారాజ్యం తర్వాత..
తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఎదురైన అనుభవాలలను దృష్టిలో ఉంచుకుంటే.. జనసేన పార్టీ ఏర్పాటు నిజంగా దుస్సాహసం లాంటిదేనని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అర్జెంటుగా గద్దెనెక్కాలన్న ఆశ తనకు లేదని, ఒకవేళ అధికారం చేపట్టడమే టార్గెట్ అయితే రాజకీయం మరోలా ఉండేదని చెప్పారు. ప్రజారాజ్యంపై పవన్ తరచూ మాట్లాడుతుండటం చర్చనీయాంశమవుతోన్న సంగతి తెలిసిందే. అప్పుడు ప్రజారాజ్యం కాకుండా.. తర్వాతి కాలంలో జనసేన నేరుగా పుట్టుంటే ఏపీపై చాలా ప్రభావం ఉండేదని పవన్ గతంలో ఓ సందర్భంలో అన్నారు.
విడగొట్టడం తేలిక..
కులం, మతం, ప్రాంతాల ఆధారంగా ప్రజల్ని విడదీయడం చాలా తేలికైన వ్యవహారమని, అదే కలిపి ఉంచడం మాత్రం చాలా కష్టమైన పని అని జనసేనాని అన్నారు. ప్రస్తుత తరుణంలో ధనబలం లేకుండా ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని, అంతమాత్రాన అక్రమమార్గంలో అధికారాన్ని చేపట్టబోమని, ప్రజల్లో చైనత్యం పెంపొందించి, వారి మద్దతుతోనే ముందుకెళతామన్నారు.
ముస్లింలకు భరోసా..
పౌరసత్వ సవరణ, ఎన్ఆర్సీ చట్టాలపై కొందరు తప్పుడు ప్రచారం చేయడంవల్లే ముస్లింలు ఆందోళనకు గురవుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయ నాయకులందరూ కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా మాట్లాడాలని, అపోహల్ని ప్రచారం చేయరాదని సూచించారు. సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలపై ముస్లింలు అడిగిన పలు ప్రశ్నలకు పవన్ సమాధానాలిచ్చారు.
సీఏఏ, ఎన్ఆర్సీ అంటే..
కేవలం అవగాహనారాహిత్యంతోనే దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్ఆర్సీపై ఆందోళనలను వ్యక్తమవుతన్నాయని జనసేనాని చెప్పారు. ‘‘సీఏఏ అనేది భారతపౌరులకు సంబంధించిన వ్యవహారం కాదు. విదేశాల్లో మతపీడ ఎదుర్కొన్నవాళ్లకోసం తీసుకొచ్చిన చట్టం అది. ఎన్ఆర్సీ గురించి కూడా ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ఆధార్ కార్డు మాదిరిగానే ఎన్ఆర్సీలో మనకు సంబంధించిన సమాచారాన్ని తీసుకుంటారు. దేశంలో ఎంత మంది ఉంటున్నారో, ఏం చేస్తున్నారో అని తెల్సుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టే ఈ ప్రక్రియ చేపట్టారు. అంతేగానీ దీనివల్ల ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగదు''అని పవన్ కల్యాణ్ వివరించారు.