లాంగ్ మార్చ్ చేసినా ప్రభుత్వం దిగి రాలేదు: జగన్ సర్కార్ పై గవర్నర్ కు పవన్ కల్యాణ్ ఫిర్యాదు
విజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత వ్యవహారం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యల తీవ్రత పంచాయతీ రాజ్ భవన్ గడప తొక్కాయి. ఆయా అంశాలపై పవన్ కల్యాణ్ సహా ఇతర నాయకులు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూరకంగా కృత్రిమ కొరతను సృష్టించిందని, ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరవైందని గవర్నర్ వద్ద ప్రస్తావించారు. జీవనోపాధిని కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. అదేమని ప్రశ్నించిన వారికి వరదల అంశాన్ని సాకుగా చూపుతోందని విమర్శించారు.
నమ్మకు నమ్మకు ఈ రేయిని...అంటూ పవన్ ట్విట్టర్ పోస్ట్: ఇసుక పాలసీపై చురకలు
దీనితో పాటు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపైనా గవర్నర్ వద్ద ప్రస్తావించారు. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు వ్యక్తిగత దాడికి దిగడం సరైనది కాదని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పొలిట్ బ్యురో సభ్యుడు అర్హం ఖాన్, ప్రధాన కార్యదర్శి శివశంకర్ సహా పలువురు నాయకులు విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మంది దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారని అన్నారు. ఇసుక కొరతను వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తూ తాము విశాఖపట్నంలో వేలాదిమందితో లాంగ్ మార్చ్ నిర్వహించామని, అయినప్పటికీ ప్రభుత్వం దిగి రాలేదని అన్నారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని గవర్నర్ ను కోరారు. ఇసుక కొరతను తీర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంత్యుత్సవాల సందర్భంగా సోమవారం నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లపై ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
పవన్ కల్యాణ్ కు ముగ్గురు భార్యలు, నలుగురైదుమంది పిల్లలు ఉన్నారని, వారంతా ఎక్కడ? ఏ మాధ్యమంలో చదువుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల పట్ల జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా ద్వారా వైఎస్ జగన్ పై ఎదురుదాడికి దిగారు. ఈ వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా బాధను కలిగించాయని, ఇలాంటి చర్యలకు దిగడం, వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని మానుకోవాలని ముఖ్యమంత్రికి సూచించాలని వారు గవర్నర్ ను కోరారు.