ఢిల్లీలో పవన్ సంచలనం: కేంద్రం సమ్మతి లేదు.. ఏపీ రాజధాని మారదు.. రిపబ్లిక్ డే వేదిక మార్పే నిదర్శనం
దేశరాజధాని ఢిల్లీ నుంచి ఐదు కోట్ల ఆంధ్రులకు, రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. మోదీ కేబినెట్ లో నంబర్ 3గా కొనసాగుతోన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో బుధవారం ఢిల్లీలో భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన పలు సంచలన ప్రకటనలు చేశారు. దాదాపు గంటపాటు సాగిన భేటీలో రాష్ట్రానికి సంబందించిన అన్ని విషయాలు చర్చకు వచ్చాయని, దాంతోపాటు కీలక అంశాలపై క్లారిటీ కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
ఏం మాట్లాడారంటే..
ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సెక్రటేరియట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీకి సంబంధించిన వివరాలను పవన్ స్వయంగా వెల్లడించారు. ఏపీకి సంబంధించిన చాలా కీలకమైన విషయాలు చర్చించుకున్నామని, అందులో అమరావతి, రాజధాని తరలింపుతోపాటు ఆర్థిక సంబంధమైన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేయడంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఒకేలా వ్యవహరించాయని విమర్శించారు.
ఢిల్లీ నుంచి మాటిస్తున్నా..
‘‘అమరావతికి సంబంధించి ఈ ఢిల్లీ గడ్డపై నుంచి ఐదు కోట్ల ఆంధ్రులకు, రాజధాని కోసం ఉద్యమించిన రైతులకు నేను మాటిస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధాని అమరావతే. దాన్ని ఎవరూ తరలించలేరు.. మూడు రాజధానులంటూ వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం సమ్మతి లేదు.. అమరావతికి సంబంధించి బీజేపీ-జనసేన కూటమి చాలా బలమైన కార్యాచారణ ప్రకటించబోతోంది..''అని పవన్ తెలిపారు.
వైసీపీకి అర్థమైంది కాబట్టే..
రాజధాని తరలింపు ముమ్మాటికీ అసాధ్యమన్న సంగతి వైసీపీకి అర్థమైందని, రిపబ్లిక్ డే వేడుకల వేదిక మార్పే అందుకు పెద్ద నిదర్శనమని జనసేన చీఫ్ తెలిపారు. ‘‘వైసీపీ వాళ్లు వైజాగ్ లో రిపబ్లిక్ డే వేడుకలు చేస్తామని టెంట్లు కూడా వేశారు.. చివరికి మళ్లీ వేదికను విజయవాడకు మార్చేసుకున్నారు.. దీన్ని బట్టి మీకు అర్థమవుతోంది కదా.. రాజధాని మార్చడం ఎంత కష్టమో.. ఒక రిపబ్లిక్ డే వేడుక వేదికనే మార్చలేని వైసీపీ ప్రభుత్వం.. రేపు రాజధానిని మార్చలేదన్న సంగతి ప్రజలకు తెలియాలి''అని వివరించారు.
కేంద్రం పాత్రపై కీలక కామెంట్లు..
కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామంటూ వైసీపీ నేతలు పదేపదే చెప్పడాన్ని పవన్ కల్యాణ్ ఖండించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులకు కేంద్రం సమ్మతి లేదన్న పవన్ కల్యాణ్ మరుక్షణంలోనే.. రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారమని, ఇందులో కేంద్రం సమ్మతి, అసమ్మతి ప్రస్తావన ఉండదని చెప్పడం గమనార్హం. కేంద్రాన్నిభ్రష్టుపట్టించేలా వైసీపీ నేతలు మాట్లాడితే ఊరుకోబోమని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.