చిచ్చుపెట్టేలా బాబు, జగన్ ఏడాదికో మాట: పవన్, 'కాపు'పై నిపుణులతో చర్చ
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం పొలిటికల్ అఫైర్స్ కమిటీతో తొలిసారి సమావేశమయ్యారు. రిజర్వేషన్లపై కూలంకశ అధ్యయనానికి నిపుణులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన కాపు రిజర్వేషన్ల అంశంపై స్పందించారు.
కాపు దెబ్బ: ఇదీ విషయం... వైసీపీ ట్విస్ట్, జగన్ వ్యూహంపై టీడీపీ అప్రమత్తం
రిజర్వేషన్లను అధికార (టీడీపీ), ప్రతిపక్ష (వైయస్సార్ కాంగ్రెస్) పార్టీలు రాజకీయం చేస్తున్నాయని వాపోయారు. కాపుల రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని చెప్పారు. ఈ అంశంపై వైసీపీ అధినేత జగన్ ఏడాదికో మాట మారుస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలకు కచ్చితమైన అభిప్రాయం లేదన్నారు. అర్హులైన వర్గాలన్నింటికి రాజకీయ ఫలాలు అందాలన్నారు.
జగన్పై చంద్రబాబు ఆగ్రహం
అంతకుముందు, జగన్ పైన సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. విశాఖపట్టణం జిల్లా ఎస్ రాయవరం మండలంలోని గుడివాడలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తాడని, రోజూ ఒకటి రెండు గంటలు నడుస్తాడని, సినిమా షూటింగ్లో మాదిరి జగన్ ఫొటోలు దిగుతారని, కేసుల మాఫీ కోసమే రాష్ట్ర భవిష్యత్ను తాకట్టు పెట్టాలని చూస్తున్నారన్నారు.
బీజేపీ చేసిన నమ్మకద్రోహానికి ప్రజలు ఎవరూ ఓటు వేయరని, జగన్, పవన్లను అడ్డుబెట్టుకుని మళ్లీ మోసం చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. ఖబడ్దార్.. తెలుగు ప్రజల్ని మోసం చేయలేరన్నారు. జగన్, పవన్లు బీజేపీ అధికారానికి దాసోహమయ్యారన్నారు. అసెంబ్లీకి కూడా రాని వైసీపీ ఎమ్మెల్యేలు అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారన్నారు.