Pawan Kalyan: హైకోర్టు ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చే సమయం: గురు, శుక్రవారాల్లో కర్నూలు జిల్లా నేతలతో..!
కర్నూలు: రాజధానిని ఎక్కడ ఫెట్టాలనే విషయం ఆయా రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోబోదన లోక్సభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో.. రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ వస్తోన్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన తమ వైఖరిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు కనిపిస్తోంది.
కేంద్రం క్లియర్..ఇక వైసీపీ యాక్షన్ ప్లాన్: మూడు రాజధానులకు అనుకూలంగా.. రాష్టవ్యాప్తంగా.. !
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వైపు మొగ్గు చూపేలా..
విశాఖపట్నంలో సచివాలయం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలను ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నాయి టీడీపీ..బీజేపీ.. జనసేన. తాజాగా కేంద్రం ప్రభుత్వం తన నిర్ణయాన్ని తేటతెల్లం చేయడంతో సరికొత్త వ్యూహాలను రూపొందించుకునే పనిలో పడ్డాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకే కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడంపై సానుకూలతను వ్యక్తం చేశారు.
బీజేపీ జై కొట్టేలా..
కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసే విషయంలో కమలనాథులు బీజేపీ పునరాలోచనలో పడింది. తాము అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం, అంతకుముందే- కర్నూలు డిక్లరేషన్ను రూపొందించుకోవడం వంటి పరిణామాల మధ్య కమలనాథులు సైతం హైకోర్టు ఏర్పాటుపై సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ అంశంపై గతంలో కూడా జీవీఎల్ నరసింహారావు వంటి ఒకరిద్దరు నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
జనేసేన మొదట పోరుబాట..
ఎటొచ్చీ ఇక జనసేన పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంది. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా తన నిర్ణయాన్ని వెల్లడించినప్పటి నుంచీ జనసేన పార్టీ పోరుబాటే పట్టింది. మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తోన్న అమరావతి ప్రాంత రైతులకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. అమరావతి గ్రామాల్లో రైతులతో సమావేశం అయ్యారు. మందడం, తుళ్లూరు.. వంటి గ్రామాల్లో పర్యటించారు.
వైఖరిని స్పష్టం చేయాల్సిన సమయం..
జనసేన పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. గురు, శుక్రవారాల్లో పవన్ కల్యాణ్.. కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. 6వ తేదీన పాణ్యం, 7వ తేదీన కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తలతో సహా నియోజకవర్గ ఇన్ఛార్జిలతో పవన్ కల్యాణ్ భేటీ అవుతారు. ఈ భేటీ సందర్భంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై పవన్ కల్యాణ్ ఓ స్పష్టత ఇస్తారని అంటున్నారు.
మంగళగిరి కాదు.. హైదరాబాద్
ఈ సమావేశాన్ని తొలుత- మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. కర్నూలుకు మంగళగిరి కంటే హైదరాబాదే దగ్గర అవుతుందని, అందుకే హైదరాబాద్లోనే భేటీ కావాలని జిల్లా నాయకులు పవన్ కల్యాణ్కు విజ్ఙప్తి చేయడంతో వేదికను మార్చారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశాలు ఏర్పాటు కానున్నాయి. పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జి నాదెండ్ల మనోహర్ సహా కొందరు ముఖ్య నాయకులు దీనికి హాజరవుతారు.