మీరేమన్నారో చూడండి!: బాబుకు పవన్ దిమ్మతిరిగే షాక్, 'ఇక ఎలా నమ్మగలం'
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. ఉదయం పది గంటలకు ఉండవల్లి గుహలను సందర్శించి, ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం పలువురు నేతలను పార్టీలకి ఆహ్వానిస్తారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో పలువురు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.
విభజన ద్వారా నష్టపోయిన ఏపీకి న్యాయం చేకూరే వరకు తమ పోరాటం ఆగదని, ఒకరోజు బంద్తోనో, కాగడాల ప్రదర్శనలతోనో సరిపెట్టుకోమని పవన్ ప్రకటించారు. ఈ మేరకు జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు కోసం నిరంతరాయంగా పోరాటం చేయాల్సిందేనని పేర్కొన్నారు.
ఢిల్లీకి వినిపించే వరకు మడమ తిప్పం
జనసేన చేపట్టిన పోరాటయాత్ర అందులో భాగమేనని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి ప్రజల గళాన్ని, హోదా కోసం ప్రజలు పెంచుకున్న ఆశలు, ఆకాంక్షల్ని ఈ పర్యటనలో వినిపిస్తామన్నారు. అధికార పార్టీలు విభజన విషయంలో ఎలా మోసం చేశాయి, నాటి చట్టంలో పేర్కొన్న వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఎలా అన్యాయం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. పాలకుల ద్వంద్వ వైఖరిని, ప్రజలను మోసం చేస్తున్న తీరకు నిరసనగా కవాతులు నిర్వహించి, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను ఢిల్లీకి వినిపించే వరకు మడమ తిప్పకుండా పోరాటం చేస్తామన్నారు.
చంద్రబాబుపై విమర్శలు
ఏపీకి న్యాయం జరిగే వరకు జనసేన ముందుకు సాగుతూనే ఉంటుందన్నారు. ప్రభుత్వంలో పాలన చేస్తున్నవారే విభజన హామీల అమలు విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని, వారి రాజకీయ ప్రయోజనాలకు అనువుగా మాటలు మారుస్తున్నారనేది వాస్తవమని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హోదా విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీతో సమానంగా రాష్టంలో ఉన్న టీడీపీ అంతే దారుణంగా రాష్ట్ర ప్రయోజనాలని దెబ్బ తీసిందని మండిపడ్డారు.
ఇంత చేశాక ఎలా నమ్మగలం
బీజేపీ, టీడీపీలు ప్రజలను మోసం చేశాయన్నారు. ఒకవైపు టీడీపీ ఎంపీలు బీజేపీని తిడతారని, మరోవైపు బీజేపీ కాళ్ళు మొక్కుతారని, ఈ ద్వంద్వ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిండు సభలో చంద్రబాబు తమ మిత్రుడేనని ప్రకటించారని, దీనిని బట్టి మన ముఖ్యమంత్రి చేస్తున్నది ధర్మ పోరాటం అని ఎలా నమ్మగలమని ప్రశ్నించారు.
హోదాపై టీడీపీ వాదం అంటూ పవన్ పోస్టులు
ప్రత్యేక హోదా కోసం జనసేన తిరుపతిలో, కాకినాడలో గళం విప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ వాదం ఇలా ఉందంటూ పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం ఆనాటి పత్రికలను పోస్టు చేశారు. అందులో చంద్రబాబు హోదాపై చెప్పిన వ్యాఖ్యలు ఉన్నాయి. హోదాతో ఏం వస్తుందని, హోదాతో ఒరిగేదేం లేదని, హోదా అంటే జైలుకేనని, హోదాతో పరిశ్రమలు రావని, హోదా వేస్ట్ అని చంద్రబాబు నాడు పేర్కొన్నట్లుగా పత్రికల్లో వచ్చిన వాటిని పోస్ట్ చేశారు. చంద్రబాబు హోదా అడగనేలేదని నాడు బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ అన్న పత్రిక కట్టింగ్ను కూడా పోస్ట్ చేశారు. హోదాపై నేను యూటర్న్ తీసుకున్నానా అని చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రశ్నించడంపై పవన్ దిమ్మతిరిగే షాకిస్తున్నారు. ఆయన వరుసగా ట్వీట్లు చేస్తోన్న విషయం తెలిసిందే.