జగన్ ఇలాకాపై పవన్ కళ్యాణ్ కన్ను, తెరపైకి థర్డ్ ఫోర్స్! అంత సీన్లేదని వైసీపీ
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం గురువారం నుంచి ఆయన పర్యటన ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 22న లేదా 23న రాయలసీమ జిల్లాల్లో పర్యటన ప్రారంభించనున్నారు.
పార్టీలోకి పిలిచి, ఇంత మోసం చేస్తావా?: జగన్పై సొంత పార్టీ నేత నిప్పులు, ఓడిస్తానని వార్నింగ్
కర్నూలు పర్యటనలో కీలక నేతలతో చర్చలు
ఉత్తరాంధ్ర, గోదావరి తదితర జిల్లాల్లో పర్యటించిన జనసేనాని ఇప్పుడు రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ జిల్లాల్లో పర్యటించే పవన్ కీలక నేతలతో భేటీ అయి, వచ్చే ఎన్నికల్లో ఏం చేద్దాం, ఎలా ముందుకు వెళ్తామనే అంశాలపై కూడా చర్చించనున్నారు. పార్టీ బలోపేతం కోసం జనసైనికులతో భేటీ కానున్నారు. కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా జనసేన నేత కేజే రెడ్డికి చెందిన రాగమయూరి రిసార్టులో ఉండనున్నారు.
టీడీపీ వర్సెస్ వైసీపీ.. తెరపైకి థర్డ్ ఫోర్స్
వైసీపీ పార్టీకి ముందు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీగా ఉంది. జగన్ వచ్చాక ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య సామాన్యులు నలిగిపోతున్నారని జనసేన అభిప్రాయపడుతోంది. కొంతమంది అనుభవజ్జులకు జనసేనలో పదవులు ఇవ్వడంతో పాటు టీడీపీ, వైసీపీలోని మూడో ఫోర్స్ను తెరపైకి తెచ్చేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు అవకాశం దక్కని వారికి కూడా కొంతమందిని తెరపైకి తీసుకు వచ్చి, టీడీపీ, వైసీపీలకు ధీటుగా రాజకీయం చేయాలని భావిస్తున్నారు.
జనసేనకు పట్టు.. మెజార్టీ స్థానాలు వస్తాయని ధీమా
కర్నూలుకు చెందిన కేజే రెడ్డి పారిశ్రామికవేత్త. కర్నూలు జిల్లాలో జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఆయన పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. జనసేన కొత్త పార్టీ అయినప్పటికీ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉందని, గెలుపు తథ్యమని జనసైనికులు భావిస్తున్నారు. పాణ్యంతో పాటు నంద్యాల, కర్నూలు, ఆదోని, ఆళ్లగడ్డ, డోన్, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కొడమూరులలో జనసేనకు పట్టు ఉందని, దీనికి తోడు సరైన అభ్యర్థులను ఎంపిక చేస్తే జిల్లాలో పలు స్థానాల్లో జనసేన విజయం ఖాయమని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చినా, జనసేనాని కీలకం కానున్నారని జనసైనికులు భావిస్తున్నారు.
జనసేనానికి అంత సీన్ లేదని వైసీపీ
రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, కడపతో పాటు చిత్తూరు జిల్లాలోను వైసీపీకి మంచి పట్టు ఉంది. పవన్ గతంలో అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఇప్పుడు కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో.. ఒక్కో జిల్లాలో మూడు రోజుల చొప్పున పర్యటించనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు స్పందిస్తూ.. అసలు జనసేనకు రాయలసీమలో ఏమాత్రం పట్టులేదని, తమకు ఎలాంటి ఆందోళన లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో జనసేనకు స్థానం లేదని కర్నూలు వైసీపీ లోకసభ ఇంచార్జ్ బీవై రామయ్య అన్నారు. కర్నూలులో వైసీపీకి మంచి బలం ఉందని, రోజురోజుకు ఆ బలం ఇంకా పెరుగుతోందని చెప్పారు. ఎవరు వచ్చినా రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోని 80 శాతం సీట్ల వైసీపీ గెలుచుకోవడం ఖాయమని చెప్పారు. ఇతర పార్టీలకు చుక్కెదురు తప్పదన్నారు.