చంద్రబాబూ! మీరు సుఖసంతోషాలతో ఉండరు, హెరిటేజ్ ఉందిగా.. జీతాలెందుకు: పవన్ హెచ్చరిక
Recommended Video
పాడేరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం విశాఖ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేను సీఎంకు పాడేరు నుంచి చెబుతున్నానని.. మన్యంను అడ్డగోలుగా దోచేస్తున్నారని, ప్రభుత్వ ఖజానాకు పాడేరు నుంచి రావాల్సిన డబ్బులు రాలేదని, ఇలా చేస్తే కళింగాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని హెచ్చరించారు.
ఇలా చేస్తే తెలంగాణ వలె కళింగాంధ్ర ఉద్యమం రావడం ఖాయమన్నారు. కళింగాంధ్ర ఉద్యమం ప్రారంభమైతే మీతో సహా ఎవరికీ సుఖ సంతోషాలు ఉండవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పవన్ మాట్లాడుతుండగా అభిమానులు, జనసేన కార్యకర్తలు పదేపదే సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ఎయిర్ఏషియా స్కాం-బాంబు పేల్చిన బొత్స: ఆ ఫోన్ల తర్వాతే మార్పు, సింగపూర్లో బాబు వారిని కలవలేదా?
యువతా.. మీరు అడగరా?
స్పెషల్ డీఎస్సీపై సీఎం చంద్రబాబు మూడేళ్లుగా చెబుతున్నారని, చేస్తున్నారా, మీరు అడగరా అని యువతను ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, కానీ వస్తున్నాయా అని అడిగారు. తాను ఇక్కడకు రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వ ఆసుపత్రి, వంద పడకల గురించి అన్నారు. ఇక్కడ వంద పడకలు ఉన్నాయని, కానీ అందుకు కావాల్సిన డాక్టర్లు, సిబ్బంది, అంబులెన్సులు లేవన్నారు. సీఎంకు నేను పాడేరు నుంచి చెబుతున్నానని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అన్నారని, కానీ జబ్బుల ఏపీని చేశారన్నారు. దేశంలో ఎక్కువ మంది డాక్టర్ గ్రాడ్యుయేట్లు ఏపీ నుంచే ఉంటారని, కానీ ఇక్కడి ఆసుపత్రుల్లో ఉండరన్నారు. మొన్న నేను ఇక్కడ ఓ చిన్నారిని ఎత్తుకున్నానని, నా కొడుకు అంత వయస్సు ఉన్నదని, ఆమెను ఎత్తుకుంటే ఏదో విచిత్ర వ్యాధి ఉందని తేలిందన్నారు.
చంద్రబాబూ! హెరిటేజ్ ఉండగా మీకు జీతాలు ఎందుకు?
తనకు హెరిటేజ్ ఉండగా రాజకీయాల్లో డబ్బులు అవసరమా అని చంద్రబాబు, లోకేష్ చెబుతున్నారని, అసలు మీకు వేతనాలు ఎందుకని పవన్ ప్రశ్నించారు. వేతనాలు తీసుకోకుండా పని చేయాలన్నారు. 2007 నుంచి తనకు రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం ఉందని చెప్పారు. నాటి నుంచి పోడు భూముల సమస్యలు వింటున్నానని చెప్పారు. ఆ భూములు ఇస్తారా లేదా చెప్పాలని నిలదీశారు. పోడు భూమి పట్టాలపై ఓ వివరణ కావాలని డిమాండ్ చేశారు. నేను ఇవ్వడానికి అధికారంలో లేనని చెప్పారు. టీడీపీ నేతలు మాట్లాడుతుంటే బాత్రూంలు కట్టించామని చెబుతారని, కానీ నీళ్లు లేని చోట ఏం కడితే ఏం లాభమన్నారు. సులబ్ కాంప్లెక్స్ కట్టించినా, ఏం కట్టించినా ఫలితం ఉండదన్నారు. ఈ సమస్యలు ఒక్క రోజుతో తీరేవీ కావని, నేను మీకు అండగా నిలబడేందుకు, పోరాటం చేసేందుకు వచ్చానని చెప్పారు.
టీడీపీ కులాల మధ్య చిచ్చు పెడుతోంది
రిజర్వేషన్లపై తనకు బలమైన అవగాహన ఉందని, ఓట్లు వేయించుకొనే రాజకీయాలు చేయనని పవన్ చెప్పారు. టీడీపీ కులాల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. గిరిజన సంప్రదాయాన్ని తొలగిస్తే అన్నింటిని దోచుకోవడం చాలా సులభం అన్నారు. కులాల మధ్య ఐక్యత చాలా ముఖ్యమని చెప్పారు. కానీ విడదీసే రాజకీయాలు చేస్తే చంద్రబాబుకు, టీడీపీకి లాభం అన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ పెట్టాలో ఇప్పటి వరకు చంద్రబాబుకు అవగాహన, చిత్తశుద్ధి లేదన్నారు.
దీక్ష పేరుతో కోట్లు ఖర్చు
ప్రత్యేక హోదాపై తాను మొదటి నుంచి మాట్లాడుతున్నానని పవన్ గుర్తు చేశారు. అప్పుడు నేను మాట్లాడితే అవసరం లేదని చెప్పారన్నారు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు ప్రత్యేక హోదా అంటూ దీక్షలు చేస్తున్నారు. ఆయన చిత్తశుద్ధి లేని దీక్షలపై రూ.కోటి ఖర్చు పెడుతున్నారన్నారు. ఇలా దీక్షలపై పెట్టే రూ.కోటి పాడేరు ఆసుపత్రికి ఇస్తే బాగుండేదన్నారు. రూ.కోట్లు ఇస్తే ఇక్కడ నీటి బాధలు తొలగుతాయన్నారు. పేపర్లోనే టీడీపీ ప్రభుత్వం బాగుందన్నారు. ప్రజల నుంచి వచ్చే పాలసీలు బలంగా ఉంటాయన్నారు. నేను ఇక్కడి నుంచి తీసుకొని పాలసీలు ఏర్పాటు చేసుకునేందుకు వచ్చానని, ఓట్లు అడిగేందుకు రాలేదన్నారు.