2019లో పెనుమార్పులు, చంద్రబాబును మార్చి తీరాలి, నా వారిని అంటే: పవన్ తీవ్ర హెచ్చరిక
తుని: తనను పవర్ స్టార్ అని అందరూ అంటారని, పవర్ మీలో ఉంటే స్టార్.. పైన భగవంతుడిలో ఉందని, మధ్యలో నేను ఉన్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తుని బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మీ అందరి పవర్, ఆ దేవుడి దీవెన తోడుగా ఉంటే ముఖ్యమంత్రి అవుతానని, ఒక సరికొత్త రాజకీయ మార్పును సాధించి తీరుతానని చెప్పారు.
రాహుల్ గాంధీ-చంద్రబాబు కలయిక, కాంగ్రెస్కు ఏపీలో భారీ షాక్, వట్టి వసంత్ రాజీనామా
మార్పు అనేది కోట్లమంది ఆలోచన, మనం అంత కలిస్తే మనకి చంద్రబాబు ఎందుకు, జగన్ ఎందుకు, మోడీలు ఎందుకు, కాంగ్రెస్ ఎందుకని ప్రశ్నించారు. మనం అఖండమైన భారతంలో మార్పు తీసుకొని రావొచ్చునని చెప్పారు. మీ పార్టీ వారు రౌడీయిజం చేస్తే తోలు తీస్తానని చంద్రబాబును ఉద్దేశించి చెప్పారు.
రాజకీయాల్లో పెనుమార్పులు
పవన్ కళ్యాణ్ అంటే కాపు అంటే ఎలాగని జనసేనాని ప్రశ్నించారు. అశోక్ గజపతి రాజు అంటే కేవలం క్షత్రియేనా అన్నారు. ఈ వ్యవస్థ మారాలి అని పిలుపునిచ్చారు. కులాల ముసుగులో దోపిడీలు చేసి, అవినీతి చేసి, లంచాలు తిని.. కులాల ముసుగులో దాక్కోవడం నచ్చదని చెప్పారు. 2019లోపు దేశ రాజకీయాల్లో బలమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని చెప్పారు. ఇది జోస్యం అనుకోండి.. ఏమైనా అనుకోండి.. కానీ సరికొత్త రాజకీయ శకం ప్రారంభం కానుందని చెప్పారు.
నన్ను తిడితే ఓకే, కానీ.. తాటతీస్తా
తనను పవర్ స్టార్ అంటారని, కానీ తాను చాలా చిన్నవాడినని, దిగువ మధ్య తరగతి నుంచి వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేన ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోదని తేల్చి చెప్పారు. నన్ను పచ్చిబూతులు తిట్టినా నేను భరిస్తానని, కానీ తన అన్నదమ్ములను, తన కుటుంబ సభ్యులను, తన ఆడపడుచులను తిడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాట తీస్తానని చెప్పారు. ఈ విషయాన్ని తాను ప్రతి ఒక్కరికి చెబుతున్నానని అన్నారు. ఇది తాను సంస్కారంతో చెబుతున్నానని అన్నారు. నేను దేనికీ భయపడేది లేదన్నారు.
జాగ్రత్త అని హెచ్చరిక
చంద్రబాబు నాయుడు వంటి వ్యక్తులు సీఎంగా కావొద్దని, బాధ్యత కలిగిన వారు సీఎంలుగా ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. దోచుకునే వారు, వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకునే వారు సీఎంగా కావొద్దన్నారు. నూరు గొడ్లను తిన్న రాబందు కూడా ఒక గాలివానకు పడిపోయినట్లు, మీరు జనసైనికులను బెదిరిస్తే, మా జెండాలు పీకేస్తే 2019లో ఎన్నికల్లో పడిపోయి చచ్చిపోతారు జాగ్రత్త అని హెచ్చరించారు.
చంద్రబాబును మార్చి తీరాలి
ప్రతి ముప్పై ఏళ్లకు రాజకీయ వ్యవస్థ మార్పు జరగాలని, ఎప్పుడో 1980ల్లో ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు వచ్చారని, ఇప్పుడు వారి రిటైర్మెంట్ వయసు వచ్చిందని, మార్చి తీరాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అశోక్ గజపతి రాజును అంటే ఆయనను అన్నట్లు మాత్రమేనని, క్షత్రియులను అన్నట్లు కాదని, తనను అంటే నన్ను అన్నట్లేనని, కాపులను అన్నట్లు కాదని చెప్పారు. నేనేదో అశోక్ గజపతి రాజను అంటే మా కులం వారు బాధపడ్డారని చెప్పడం ఏమిటన్నారు. ఇదే తునిలో రైలు బోగీలు తగల బెట్టారని, అదే తుని నుండి ఒక రాజకీయ వ్యవస్థ మార్పు కోసం ఉద్యమం మొదలవుతోందన్నారు. నేను ప్రధానిని కలవొచ్చునని, కానీ టీడీపీ నాయకుల్లా టీ తాగి వచ్చి చర్చలు బాగా జరిగాయని అబద్దం చెప్పలేనని అన్నారు.