చంద్రబాబు తన తీరు మార్చుకోవాలి: కడపలో లాఠీచార్జ్పై జనసేన ఆగ్రహం
కడప/అమరావతి: కడప జిల్లాలో ఉక్క పరిశ్రమ సాధన కోసం పోరాడుతున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజా గళం వినిపిస్తున్న పార్టీల గొంతు నొక్కడం సరికాదని అభిప్రాయపడింది.
కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఆందోళన చేస్తుంటే పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనిపై జనసేన స్పందించింది. ఒక కార్యకర్త చావు బతుకుల్లోకి వెళ్లడం బాధాకరమని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో పోరాటాలు భాగమని, ఆ క్రమంలో వామపక్షాలు కలెక్టరేట్ ముట్టడి చేశాయన్నారు.
కానీ ఆ సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును జనసేన ఖండిస్తోందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం ఈ మేరకు పేర్కొన్నారు. విభజన హామీలలో కడపలో ఉక్కు పరిశ్రమ ఉందని, ఇది కావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు.
పాలక పక్షంవారి దీక్షలకు బందోబస్తు ఇస్తున్నారని, ప్రజల గళం వినిపిస్తున్న పార్టీల గొంతు నొక్కేలా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుమ్మెత్తి పోశారు. ఈ ధోరణి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. చావు బతుకుల్లో ఉన్న కార్యకర్తకు తక్షణం మెరుగైన వైద్యం అందించాలన్నారు.
కడపలో లాఠీ ఛార్జీని ఖండిస్తున్నాం pic.twitter.com/w2uHn1PWWO
— JanaSena Party (@JanaSenaParty) August 3, 2018
కాగా, కడప ఉక్కు పరిశ్రమ సాధనకోసం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులపై పోలీసుల లాఠీ చార్జీ చేశారు. దీంతో యోగివేమన యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రమేష్ నాయక్ సొమ్మసిల్లిపడిపోయాడు. అతడి పరిస్థితి విషమించడంతో సిపిఎం జిల్లా కార్యదర్శి కె. ఆంజనేయులు వెంటనే రమేష్ నాయక్ను చేతులపై ఎత్తుకుని రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపేందుకు సంసిద్ధం కాగా పోలీసులు బలవంతంగా రిమ్స్కు తరలించారు. వైద్యులు బాధితునికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండటంతో అతడిని తిరుపతి స్విమ్స్కు తరలించారు.
ఉక్కు సాధనకోసం నాలుగురోజులగా పాదయాత్రలు నిర్వహించిన ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాలు శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తుండగా పోలీసుల లాఠీ చార్జీ చేయడం ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనంగా వామపక్షాల నేతలు అభివర్ణిస్తున్నారు. లాఠీచార్జీలో గాయపడిన విద్యార్థి నాయకుడు రమేష్ నాయక్ను సిపిఎం కడప జిల్లా కార్యదర్శి కారు ఆంజనేయులు, రాష్ట్ర కమిటీ సభ్యులు నారాయణరెడ్డి పరామర్శించారు. ఈ మేరకు విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.