#SaveTelugufromYSRCP: తెలుగు భాషా పరిరక్షణ కోసం జనసేన హ్యాష్ ట్యాగ్ ఉద్యమం.. మీ టూ తరహాలో..!
Recommended Video
అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియంలో విద్యను బోధించాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చర్యలపై చెలరేగిన వివాదాలు, విమర్శల దుమారం ఇంకా తగ్గలేదు. పైగా సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. సోషల్ మీడియాను కేంద్రబిందువుగా చేసుకుని జనసేన పార్టీ ఏకంగా హ్యాష్ ట్యాగ్ ఉద్యమాన్ని చేపట్టింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం కోసం ప్రత్యేక ప్రాజెక్టు: స్పెషలాఫీసర్ గా.. !
జోరు మీదున్న జనసేన
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు విద్యార్థులందరికీ ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ముందు నుంచీ వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. ఆరంభంలో తెలుగుదేశం పార్టీ కూడా జనసేనతో కలిసి ఉమ్మడిగా నిరసన గళాన్ని వినిపించింది. క్రమంగా తెలుగుదేశం వెనక్కి తగ్గినప్పటికీ.. జనసేన పార్టీ తన వైఖరిని మార్చు కోలేదు. తెలుగు భాషను పరిరక్షించడానికి సరికొత్త ఉద్యమాన్ని చేపట్టింది.
సేవ్ తెలుగు ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ పేరుతో..
జనసేన పార్టీ నాయకులు తాజాగా చేపట్టిన ఉద్యమం `సేవ్ తెలుగు ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ`. ఈ పేరుతో హ్యాష్ ట్యాగ్ ఉద్యమాన్ని తాజాగా ప్రారంభించింది. ఈ హ్యాష్ ట్యాగ్ ఉద్యమంతో.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యను బోధించడం సంభవించే నష్టాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడం వల్ల విద్యార్థులు మాతృభాషపై పట్టును కోల్పోతారని చెబుతున్నారు జనసేన నాయకులు. తమ అభిప్రాయాలు, ఆలోచనలకు హ్యాష్ ట్యాగ్ ను జోడిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తెలియాలనే ఉద్దేశంతోనే..
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాతృభాషను మృత భాషగా మార్చేస్తోందనే విషయాన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ హ్యాష్ ట్యాగ్ ఉద్యమాన్ని చేపట్టినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. దీన్ని మరింత విస్తృతం చేస్తామని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునేంత వరకూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొండి వైఖరిని, ఒంటెద్దు పోకడలను ప్రజల ముందు ఉంచుతామని అంటున్నారు. మీ టూ తరహాలో దీన్ని అందరి దృష్టికి తీసుకెళ్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
ఇంగ్లీష్ మీడియంలో బోధనపై ముందుకే..
ఇదిలావుండగా.. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో- మారుమూల గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలపై ఆధారపడి చదువుకునే పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఒక్క తెలుగు భాషలోనే పాఠాలను అభ్యసించడం వల్ల ఉపయోగం ఉండబోదని ప్రభుత్వం భావిస్తోంది. ఇంగ్లీష్ లో ధారాళంగా మాట్లాడేలా, అదే భాషలో అన్ని పాఠ్యాంశాలపైనా పట్టు సాధించేలా ప్రతి పేద విద్యార్థినీ తీర్చిదిద్దడమే తమ సంకల్పమని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అదే నిర్ణయానికి కట్టుబడి ఉంది.