జనసేన స్కెచ్..ఒక దెబ్బకు రెండు పిట్టలు: టీడీపీకి దూరంగా: ప్యాకేజీ విమర్శలకు బ్రేక్ పడేలా
అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో ఓ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతుందని భావించిన జనసేన పార్టీ ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. జనసేన పార్టీ అగ్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం లేకపోవడం వల్ల ఎప్పుడెలా ప్రవర్తించాల్సి వస్తుందనే గందరగోళం పరిస్థితులు క్యాడర్లో నెలకొన్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికితోడు- తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తోందనే అపవాదును అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ఎదుర్కొంటోంది జనసేన పార్టీ. ఆ ముద్రను చెరిపేసుకోవడానికి జనసేన పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోందని అంటున్నారు.
టీడీపీతో లోపాయకారి ఒప్పందాలంటూ విమర్శలు..
టీడీపీ నుంచి ప్యాకేజీలను అందుకుంటోందని, దానికి అనుగుణంగా తన గళాన్ని, సిద్ధాంతాలను మార్చుకుంటోందనే విమర్శలు ఉన్నాయి. దీనికి ఉదాహరణలను కూడా చూపిస్తున్నారు వైఎస్ఆర్సీ నాయకులు. రాయలసీమ దాహార్తిని తీర్చడానికి ఉద్దేశించిన పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశంపై టీడీపీ తరహాలోనే జనసేన పార్టీకి చెందిన ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. పైగా పోతిరెడ్డి పాడు ఎత్తు పెంపును గట్టిగా వ్యతిరేకిస్తోన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులతో చెట్టాపట్టాల్ వేసుకోవడాన్ని సాక్ష్యంగా చూపిస్తున్నారు.
పోతిరెడ్డిపాడు విషయంలో అలా.. టీటీడీ విషయంలో ఇలా
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్థక ఆస్తుల విక్రయాల విషయంలో తెలంగాణ బీజేపీ నాయకులతో కలిసి ఒకరోజు ఉపవాస దీక్షచేసిన జనసేన.. పోతిరెడ్డి పాడు విషయంలో అదే తెలంగాణ బీజేపీ నేతలతో ఎందుకు విభేదించలేదనే విమర్శలు ఉన్నాయి. దీనికి కారణం.. తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు ఉన్నారని ఆరోపణలను జనసేన పార్టీ ఎదుర్కొంటోంది. ఎన్నికలు ముగిసి ఏడాది కాలం కూడా గడవక ముందే.. సీపీఎం, సీపీఐ, బహుజన్ సమాజ్వాది పార్టీలతో తెగదెంపులు చేసుకోవడం.. మూల సిద్ధాంతాలకు భిన్నంగా బీజేపీతో చేతులు కలపడం జనసేన పార్టీలోని అస్థిరత్వాన్ని చాటుతోందని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.
టీడీపీ నీడ నుంచి బయటికి రావడానికి
ఈ పరిస్థితుల్లో టీడీపీ నీడ నుంచి బయటికి రావడానికి జనసేన పార్టీ తనవంతు ప్రయత్నాలను ఆరంభించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఆ పార్టీ నాయకులు, నర్సాపురం లోక్సభ అభ్యర్థి నాగబాబు చేసిన తాజా ట్వీట్లే. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవని నాగబాబు జోస్యం చెప్పారు. ఆ ఎన్నికల్లో ప్రధాన పోటీ వైఎస్ఆర్సీపీ, బీజేపీ-జనసేన మధ్యే ఉంటుందని తేటతెల్లం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఊడబొడిచిందేమీ లేదని ఘాటుగా విమర్శించారు నాగబాబు.
నాగబాబు చేసిన వ్యాఖ్యల వెనుక..
నాగబాబు చేసిన తాజాగా వ్యాఖ్యల వెనుక దీర్ఘకాల వ్యూహం ఉందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నామనే సందేశాన్ని క్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి దీన్ని ఆరంభంగా అభివర్ణిస్తున్నారు. వెంటనే కాకపోయినా.. మున్ముందు టీడీపీ నాయకులు, ఆ పార్టీ లోటుపాట్ల పైనా జనసేన నాయకులు పదునైన విమర్శలు చేయడానికి అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు. అధికార వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ.. ఈ రెండింటినీ జనసేన పార్టీ సమదూరాన్ని పాటిస్తుందని, ఈ రెండు పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడికి దిగవచ్చనీ అంటున్నారు.
Recommended Video
వన్ షాట్.. టూ బర్డ్స్
ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు టీడీపీపై విమర్శల తీవ్రతను పెంచడం వల్ల అటు పసుపు ముద్రను చెరిపేసుకోవడంతో పాటు వైసీపీ విమర్శలకు పుల్స్టాప్ చెప్పినట్టవుతుందని జనసేన నాయకులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీతో కలిసి పోటీ చేస్తామనే సంకేతాన్ని కూడా నాగబాబు ద్వారా ఇప్పించినట్టయిందని అంటున్నారు. టీడీపీని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదని, ఆ పార్టీ నాయకులు భ్రమల్లో జీవిస్తూనే ఉంటారనే సంకేతాన్ని ఇచ్చిందని అభిప్రాయపడుతున్నారు.