కవాతులో కారులోనే పవన్ డ్యాన్స్ చేస్తూ ఉత్సాహం: తొక్కిసలాట డౌట్, భారీగా పోలీసులు
ధవళేశ్వరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం బ్రిడ్జి పైన జనసేన కవాతు నిర్వహించింది. పిచ్చుకలంక నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకు కవాతు సాగింది. జనసేన కవాతుకు భారీగా జనాలు తరలి వచ్చారు. లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. గోదావరి ఉప్పొంగిందా అన్నట్లు కనిపించింది.
జనసేన కవాతు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైంది. కవాతు చేయాల్సిన 2.5 కిలో మీటర్ల మేర పార్టీ శ్రేణులు, అభిమానులతో వంతెన నిండిపోయింది. మరోవైపు, బ్యారేజీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ధవళేశ్వరం బ్రిడ్జి వద్దకు పవన్ చేరుకోగానే కవాతు ప్రారంభమైంది.
నన్ను గుర్తుంచుకోండి: అభిమానులకు పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు చురకలు
పోలీసుల సూచనతో కారులో డ్యాన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్
జనసైనికులు కిక్కిరిసిపోవడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ కారులోనే తన కవాతును సాగించారు. అభిమానులు, కార్యకర్తలతో బ్రిడ్జి మొత్తం నిండిపోయింది. కారులోనే సభాస్థలికి వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో పవన్ పోలీసుల సూచనలను పాటించారు. ఆయన కారులోనే సభాస్థలికి బయలుదేరారు. కారులోనే కవాతులో పాల్గొన్న పవన్ ఆద్యంతం డ్యాన్స్ చేస్తూ అభిమానులను అలరించారు.
తొక్కిసలాట అనుమానంతో
భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చినందున పవన్ కళ్యాణ్ నడిస్తే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని పోలీసులు భావించారు. కాబట్టి ఆయనను కారులోనే వెళ్లమని సూచించారు. ఎలాంటి తొక్కిసలాట లేదా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
జనసేన మేనిఫెస్టోపై తోట చంద్రశేఖర్
మరోవైపు, సభా స్థలి వద్ద జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ మాట్లాడారు. 21 లక్షల మంది జనసేన కార్యకర్తల పేర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగించారని ఆరోపించారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును రిజిస్టర్ చేయించుకోవాలని సూచించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా జనసేన మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు మోసం చేశారు
ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని తోట చంద్రశేఖర్ అన్నారు. రైతు రుణాలను కూడా మాఫీ చేయలేదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాయన్నారు. జనబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు రావాలంటే జనసేన అధికారంలోకి రావాలన్నారు.