టీడీపీ ఉప్పు తిన్న విశ్వాసానికి..చంద్రబాబుకు రక్షణ కవచాలుగా: వాళ్లకు జగనే సరైనోడు: నాగబాబు
అమరావతి: ప్రముఖ నటుడు, జనసేన పార్టీ నాయకుడు నాగబాబు మరోసారి ఘాటు వ్యాఖ్యలతో చెలరేగిపోయారు. కొంతకాలంగా వివాదాస్పద కామెంట్లతో తరచూ వార్తల్లోకి ఎక్కుతోన్న ఆయన ఈ సారి ఒక వర్గానికి చెందిన మీడియాను టార్గెట్గా ఎంచుకున్నారు. అర్ధరాత్రి ట్వీట్లు చేశారు. నాగబాబు సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రతినిధుల టీమ్..గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన అనంతరం ఈ ట్వీట్లు వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
శ్రీకాళహస్తి గర్భగుడి వరకు పాకిన కరోనా: అర్చకుడికి పాజిటివ్: రాహు, కేతువు కూడా ప్రవేశించని చోట
అర్ధరాత్రి ట్వీట్లకు అసలు కారణం..
టాలీవుడ్ టీమ్.. వైఎస్ జగన్తో భేటీ కావడంపై ఒక వర్గానికి చెందిన మీడియాలో ప్రతికూల కథనాలు రావడం ఆయనకు ఆగ్రహాన్ని, అసహనాన్ని కలిగించిందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుకు ప్రయోజనాలను కల్పించడం ఒక్కటే ప్రాధాన్యతగా భావిస్తోందని, అలాంటి వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డే సరైనోడు అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం తప్ప మరొక రాజకీయ పార్టీ మనుగడ సాగించకూడదని, ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు తప్ప మరొకరు ఉండకూడదనే భావన ఒక వర్గం మీడియాలో బలంగా నాటుకునిపోయిందనే అర్థం వచ్చేలా నాగబాబు కామెంట్లు చేశారు.
ముచ్చటేస్తోందంటూ చురకలు..
తెలుగుదేశం పార్టీ జెండా, అజెండాను తమ భుజా మీద మోస్తోన్న కొన్ని తెలుగు వార్తా చానెళ్లను చూస్తోంటే ముచ్చటేస్తోందని నాగబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాయని చురకలు అంటించారు. ఆ పార్టీ పట్ల వాళ్లకు ఉన్న అనురాగం, మన వాడు చంద్రబాబు నాయుడు అనే అభిమానం వావ్ అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మన అనుకున్న చంద్రబాబు కోసం ఒక వర్గం మీడియా ఎంతకైనా తెగించడానికి సాహసిస్తున్నాయని చెప్పారు.
చంద్రబాబు ప్రయోజనాలకు రక్షణ కవచాలుగా..
చంద్రబాబు ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా ఒక వర్గం మీడియా నిలిచిందని నాగబాబు అన్నారు. చంద్రబాబుకు ఉపయోగపడినంత కాలంల ఓడ మల్లయ్యగా, ఆయన తప్పులను ఎత్తి చూపిస్తే.. బోడి మల్లయ్య అంటూ ఇతర ప్రతిపక్ష నాయకులను చక్కగా విమర్శిస్తున్నాయని అన్నారు. చంద్రబాబుకు రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ, ఆయనకు దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు శభాష్ అని సెటైర్లు వేశారు. అసలు సిసలు వార్తా పత్రికల స్పిరిట్ అంటే ఇదీ అంటూ మగించారు. ఒక్కోసారి జగన్మోహన్ రెడ్డే అలాంటి వారికి కరెక్ట్ అనే డౌట్ వస్తోందని బ్రాకెట్లో పేర్కొన్నారు.
చిరంజీవిని టార్గెట్గా చేసుకోవడం వల్లే అంటూ
మెగాస్టార్ చిరంజీవి వైఎస్ జగన్ను కలుసుకోవడం.. తన వెంట టాలీవుడ్ ప్రతినిధుల బృందాన్ని తీసుకెళ్లడం, సుమారు 45 నిమిషాల పాటు చర్చించడం వంటి పరిణామాల అనంతరం నాగబాబు ఈ కామెంట్లను చేశారు. దీనికి ప్రధాన కారణం.. చిరంజీవిని విమర్శిస్తూ ఒక వర్గం మీడియాలో ప్రత్యేక కథనాలు రావడమేనని అంటున్నారు. ఇదివరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరంజీవి.. ఆయనకు అనుకూలంగా వ్యవహరించారని, ఇప్పుడు జగన్కు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారని అంటున్నారు. అందుకే- చంద్రబాబుకు ఉయోగపడినంత కాలం ఓడ మల్లయ్యగా, అనంతరం బోడి మల్లయ్యగా మీడియా అభివర్ణిస్తోందని నాగబాబు కామెంట్స్ చేశారని చెబుతున్నారు.