JD Lakshminarayana: జనసేనకు మరో షాక్ తప్పదా? బీజేపీ వైపు మాజీ జేడీ?: టచ్ లో ఉన్న సుజనా?
అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ జనసేన పార్టీ రాజీనామాల పర్వాన్ని ఎదుర్కొంటోంది. ఈ అయిదారు నెలల్లోనే పలువురు నాయకులు పార్టీని వీడారు. ఆవిర్భావం నుంచి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు అండదండగా ఉంటూ వచ్చిన కీలక నాయకులు, సిద్ధాంతకర్తలు.. ఒక్కరొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. ఈ రాజీనామాల పరంపర ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. త్వరలో మరిన్ని వికెట్లు పడొచ్చని తెలుస్తోంది.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా..
జనసేన పార్టీ నాయకుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఓటమిని చవి చూశారు. ఆ తరువాత ఆయన జనసేనలో పెద్దగా క్రియాశీలకంగా లేరు. పవన్ కల్యాణ్ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో ఒకట్రెండు సందర్భాల్లో తప్ప ఆశించిన స్థాయిలో లక్ష్మీనారాయణ చురుకుగా వ్యవహరించలేదు.
మంతనాలు చేస్తోన్న సుజనా చౌదరి..
బీజేపీ సీనియర్ నాయకుడు సుజనా చౌదరి ఈ మధ్యకాలంలో వీవీ లక్ష్మీనారాయణతో తరచూ మంతనాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. బీజేపీలో రావాల్సిందిగా ఆయన ఇదివరకే లక్ష్మీనారాయణకు ఆహ్వానాన్ని పంపించారని అంటున్నారు. జనసేనలో క్రియాశీలకంగా లేనప్పటి నుంచి సుజనా చౌదరి సహా విశాఖపట్నానికి చెందిన కొందరు బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణతో తరచూ మంతనాలు సాగిస్తున్నారని చెబుతున్నారు.
టీడీపీలో చేరే అవకాశాలు లేనట్టే..
తన ఐపీఎస్ సర్వీసుకు రాజీనామా చేసిన తరువాత లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరి, తన రాజకీయ అరంగేట్రం చేస్తారని మొదట్లో భాావించారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. ఆయన పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. విశాఖపట్నం నుంచి లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేశారు. రాజకీయాల్లో చేరడానికే లక్ష్మీనారాయణ ఐపీఎస్ సర్వీసుల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. జనసేన పార్టీలో చేరడం వల్ల తాను ఆశించిన ఫలితాలు రాలేదని, జనసేనలో కొనసాగితే.. భవిష్యత్తులో కూడా రాబోవనే భావనలో ఉన్నారని అంటున్నారు.
ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే..
జనసేన పార్టీకి ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితే వస్తే.. ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే కనిపిస్తోందని అంటున్నారు. సర్వీసుల నుంచి వైదొలగిన తొలి రోజుల్లోనే తెలుగుదేశం నుంచి అందిన ఆహ్వానాన్ని తిరస్కరించారు. దీనితో ఆ పార్టీలో చేరే అవకాశాలు లేవనే అంటున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆయనకు ముందు నుంచీ ఆసక్తి లేదు. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే. పైగా సుజనా చౌదరి వంటి కొందరు నాయకులు ఆయనతో టచ్ లో ఉన్నందున.. త్వరలో కాషాయ కండువా కప్పుకొన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
రాజీనామాల జాబితా పెద్దదే..
ఆకుల సత్యానారాయణ.. రాఘవయ్య.. వెంకట్రామయ్య..రాజు రవితేజ.. ఇలా చెప్పుకొంటూ వెళ్తే- సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత జనసేన పార్టీ నుంచి వైదొలగిన నాయకులు జాబితా పెద్దదే అవుతుంది. జనసేన సిద్ధాంతకర్తగా, మేనిఫెస్టో కమిటీ సారధిగా పేరు తెచ్చుకున్న రాజు రవితేజ.. పార్టీ నుంచి బయటికి వెళ్లడం.. అతి పెద్ద విఘాతంలా భావిస్తున్నారు. జనసేన ఆవిర్భావం నుంచీ ఆయన పార్టీలో పనిచేస్తున్నారు. పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నాయకుడే.. ఆయనపై విమర్శలు చేసి మరీ రాజీనామా చేయడం పార్టీ నిర్మాణ లోపాలను ప్రశ్నిస్తోందని అంటున్నారు.