ఇంకా దరఖాస్తు చేసుకోని పవన్ కళ్యాణ్! దూకుడు పెంచిన జగన్
అనంతపురం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నవంబర్ 10వ తేదీన అంతపురంలో ప్రత్యేక హోదా పైన బహిరంగ సభను నిర్వహించున్నారు. బహిరంగ సభ, వేదిక అనుమతి కోసం జనసేన పార్టీ నుంచి జిల్లా పోలీసులకు దరఖాస్తు రావాల్సి ఉంది. ఇంకా దరఖాస్తు రాలేదని తెలుస్తోంది. అయితే సభకు ఇంకా సమయం ఉన్నందున దరఖాస్తుకు సమయం ఉందని చెప్పవచ్చు.
పవన్ బహిరంగ సభకు సంబంధించి వేదిక ఎక్కడనేది ఖరారు కాలేదు. సాధారణంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో సభ ఉండవచ్చునని అంటున్నారు. నగరం మధ్యలో ఉండటంతోపాటు, ఎక్కువ మందికి మైదానం సరిపోతుంది. కావు ఈ మైదానాన్నే ఎంపిక చేసుకునే అవకాశముందంటున్నారు.
ప్రత్యేక హోదా కోరుతూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ తిరుపతి, కాకినాడల్లో ఇప్పటికే సభలు నిర్వహించారు. మూడో సభకు అనంతపురం వేదిక కానుంది.
పవన్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, బిజెపిల తరపున ఆయన ప్రచారం నిమిత్తం జిల్లాకు వచ్చారు. అనంతపురం, తాడిపత్రి, రాయదుర్గంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ తరపున ప్రత్యేక కార్యక్రమం, సభ నిమిత్తం తొలిసారిగా జిల్లాకు వస్తున్నారు. ఇక్కడ ప్రత్యేక హోదా అంశంతోపాటు, అనంత కరవు పరిస్థితులపై మాట్లాడే అవకాశముంది.
ఇదిలా ఉండగా, ప్రత్యేక హోదా కోసం ఓ వైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. కర్నూలులో జరిగిన యువభేరీలో ఆయన మంగళవారం మాట్లాడారు. హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు.