వైఎస్ జగన్ చిత్రపటానికి జనసేన ఎమ్మెల్యే రాపాక పాలాభిషేకం: లైన్ క్లియర్ అయినట్టేనా?
రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ప్రవేశ పెట్టిన వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసించారు. ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఆయన చెప్పారు. అక్కడితో ఆగలేదు. ఆటో డ్రైవర్లతో కలిసి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వ్యవహారం పార్టీలో కలకలాన్ని రేపుతోంది. ఈ విషయం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఆటోడ్రైవర్లతో కలిసి
వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని ప్రకటించినందున ముఖ్యమంత్రిని అభినందిస్తూ ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, రాపాక వరప్రసాద్ హాజరయ్యారు. ఆటోడ్రైవర్లతో కలిసి ఆయన వైఎస్ జగన్ కు అనుకూలంగా నినాాదాలు చేశారు. వారితో గొంతు కలిపారు. వైఎస్ జగన్ ను మనసున్న నాయకుడిగా అభివర్ణించారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న ముఖ్యమంత్రిని తాను చూడలేదని అన్నారు.
వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారని
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల్లో సగానికి పైగా హామీలను నెరవేర్చారని, బడ్జెట్ గురించి ఎంత మాత్రం ఆలోచించకుండా బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారని ప్రశంసించారు. ప్రజలను ఆకట్టుకునే సంక్షేమ పథకాలను ఎన్నికల సంవత్సరంలో అమలు చేసే ప్రభుత్వాలను తాను ఇప్పటిదాకా చూశానని, దీనికి భిన్నంగా వైఎస్ జగన్ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ చిత్ర పటానికి పినిపె విశ్వరూప్, రాపాక వరప్రసాద్ లు ఆటోడ్రైవర్లతో కలిసి పాలాభిషేకం చేశారు.
రాపాక వరప్రసాద్
వైఎస్ జగన్ ను రాపాక వరప్రసాద్ ప్రశంసించడం కొత్తేమీ కాదు. ఇదివరకే పలుమార్లు ఆయన ముఖ్యమంత్రి పనితీరును ప్రశంసించారు. నిండు అసెంబ్లీలో వైఎస్ ను దేవుడిగా అభివర్ణించారు. వైఎస్ జగన్ కోరని వరాలను కూడా ప్రసాదిస్తున్నారని రాపాక చెప్పిన సందర్భాలు ఉన్నాయి. రాపాక వ్యవహారాన్ని జనసేన పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. ఆయన పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయా? అనే కోణంలో ఆరా తీస్తోంది. తమ పార్టీలోకి చేరే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే.. రాజీనామా చేయాల్సిందేనంటూ వైఎస్ జగన్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు రాపాక వరప్రసాద్ పార్టీ ఫిరాయించకపోవచ్చని పార్టీ నాయకత్వం అభిప్రాయపడుతోంది.