వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు కావడం వల్లే: అత్యాచార నిందితుడిపై బలహీన కేసు: పవన్ కల్యాణ్
కర్నూలు: కర్నూలులో ఓ కామాంధుడి చేతిలో అత్యాచారానికి గురైన ఆరేళ్ల బాలికకు న్యాయం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. నిందితుడిపై పోలీసులు బలహీనమైన కేసులను నమోదు చేశారని, విచారణ సందర్భంగా ఆ కేసులు ఏవీ నిలబడబోవనే విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని అన్నారు. అత్యాచారం కేసుల్లో రాజకీయాలు తగవని హితబోధ చేశారు.
కర్నూలులోని బండిమెట్ట ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలికపై ఖాజా మొయినుద్దీన్ అనే వ్యక్తి అయిదురోజుల కిందట అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు లేని ఆ బాలిక బండిమెట్టలో నివసిస్తోన్న తన అమ్మమ్మ వద్ద ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన ఖాజా మొయినుద్దీన్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధిత బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Recommended Video
తొలుత కేసును నమోదు చేయడానికి పోలీసులు అంగీకరించలేదని, మహిళా సంఘాల ప్రతినిధులు జోక్యం చేసుకున్న తరువాతే వారు స్పందించారని పవన్ కల్యాణ్ చెప్పారు. అది కూడా బలహీనమైన కేసులను నమోదు చేశారని అన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు కావడం వల్లే నిందితుడిపై పోలీసులు బలహీనమైన కేసులు పెట్టారని ఆయన విమర్శించారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
భారతీయ జనతా పార్టీ నాయకులురాలు వినీషా రెడ్డి గురువారం ఉదయం కర్నూలులో పవన్ కల్యాణ్ను కలిశారు. ఈ కేసు వివరాలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అభంశుభం తెలియని బాలికపై 40 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడితే సాధారణ కేసు నమోదు చేశారనే విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. మైనర్లపై లైంగిక అకృత్యాలకు ఒడిగడితే పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని చట్టం చెబుతున్నప్పటికీ సాధారణ కేసుగా పరిగణించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర మహిళా కమిషన్ తక్షణం స్పందించాలని అన్నారు.