Pawan Kalyan చర్యలు ఊహాతీతం: పొత్తుల వరకేనా? అనూహ్యంగా పావులు: కమల నేతలతో బిజీగా..!
న్యూఢిల్లీ: వాడి చర్యలు ఊహాతీతం వర్మా..- పవన్ కల్యాణ్ నటించిన అజ్ఙాతవాసి మూవీలోని ఓ పాపులర్ డైలాగ్ ఇది. హీరో మనస్తత్వం ఏమిటనేది ఈ ఒక్క డైలాగ్తోనే తేల్చి పారేస్తాడు డైరెక్టర్ కమ్ రైటర్.. త్రివిక్రమ్. ఇప్పుడదే డైలాగ్ పవన్ కల్యాణ్ నిజ జీవితంలోనూ వర్తింపజేయొచ్చనేలా కనిపిస్తోంది తాజా పరిస్థితి. దేశ రాజధానిని కేంద్రంగా చేసుకుని పవన్ కల్యాణ్ కదుపుతున్న పావులు.. ఎక్కడికి దారి తీస్తాయనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
రెండురోజుల తరువాత కలిసినా..
పవన్ కల్యాణ్ ఎలిాంటి పరిస్థితుల్లో ఢిల్లీ విమానం ఎక్కారనే విషయాన్ని ప్రత్యేకించి ప్రస్తావించుకోనక్కర్లేదు. శనివారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశంలో ఉన్న అప్పటికప్పుడు హస్తినకు ప్రయాణం కట్టాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి భారతీయ జనతా పార్టీ అగ్ర నేతల పిలుపు రావడంతో హడావుడిగా బయలుదేరాల్సి వచ్చింది. పార్టీతో సంబంధం లేని, రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తోన్న పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి బీజేపీ పెద్దల నుంచి పిలుపు రావడం అనూహ్యమే.
రెండురోజుల పాటు ఢిల్లీలో మకాం..
షెడ్యూల్ ప్రకారం.. శనివారం రాత్రే ఆయన బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవాల్సి ఉండగా.. అది కాస్తా వాయిదా పడుతూ వచ్చింది. సోమవారం నాటికి ఈ భేటీ కుదిరింది. జేపీ నడ్డాతో సమావేశం కావాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ పార్టీ నేత నాదెండ్లతో కలిసి రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయడం కూడా అంతే అనూహ్యం.. అదే స్థాయిలో ప్రాధాన్యతను సంతరిచుకుంది.
పొత్తుల వరకేనా?..
రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం నెలకొంది. కాస్త అటూ, ఇటూగా నెలన్నర రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్.. ఢిల్లీ విమానం ఎక్కడం వెనుక అనేక ఊహాగానాలు చెలరేగాయి. ఆయా ఊహాగానాలన్నీ- పొత్తుల అంశం దగ్గరే ఆగిపోయాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేయొచ్చనే వార్తలు, కథనాలు వెలువడటానికి కారణాలయ్యాయి.
విలీనంపైనా మాటా మంతీ..
నిజానికి- పవన్ కల్యాణ్ను బీజేపీ అగ్ర నాయకత్వం ఎందుకు ఢిల్లీకి పిలిపించిందనడానికి సహేతుక కారణం తెలియదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న దృష్ట్యా పొత్తులపై చర్చించడానికే పిలిపించి ఉంటారని భావిస్తున్నప్పటికీ.. ఈ విషయంలో బీజేపీ జాతీయ స్థాయి నాయకులు మరో అడుగు ముందుకేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయడం గురించి కూడా ఆలోచించాలని సూచించినట్లు చెబుతున్నారు. విలీనానికి అంగీకరిస్తే.. అధ్యక్ష పదవిని కట్టబెడతామనీ, వీలైతే రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
తొలి విడత జేపీ నడ్దాతో.. మలి విడత రాష్ట్ర ఇన్ఛార్జితో
బీజేపీ పెద్దలను కలవడానికి రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన పవన్ కల్యాణ్.. సోమవారం మాత్రం ఆ పార్టీ నేతలతో తీరిక లేకుండా గడిపారు. తొలి విడతలో జేపీ నడ్డాను కలుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మలి విడతలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, కేంద్రమంత్రి వీ మురళీధరన్ను కలుసుకున్నారు. ఇదే సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల కో ఇన్ఛార్జి సునీల్ దేవ్ధర్ కూడా పాల్గొన్నారు.