ఆ ఇద్దరు నేతలపై పవన్ అకాల ట్వీట్స్: రాజకీయాల్లో హాట్ టాపిక్గా: బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం..?
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. భారతీయ జనతా పార్టీకి మరింత చేరువ అవుతున్నారా? తాజాగా ఆయన చేసిన ట్వీట్ల సందేశమేంటీ? అకారణంగా.. అకాల ట్వీట్లకు అర్థమేంటీ? కార్యకర్తలకు ఆయన ఏమి చెప్పదలచుకున్నారు?.. ప్రస్తుతం జనసేన పార్టీలో నడుస్తోన్న చర్చ ఇది. పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. విమర్శలను సంధించడానికి ఆయన రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం కల్పించినట్లయిందనే అభిప్రాయాలు వినిపిస్తోంది.
Recommended Video
వలస కూలీలను చిదిమేసిన రైలు.. రాష్ట్రాలకు బాధ్యతలేదా? అంటూ పవన్ కల్యాణ్ ఫైర్
వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయలతో అనుబంధాన్ని గుర్తు చేస్తూ..
భారతీయ జనతా పార్టీలో రాజకీయ ప్రారంభించి.. ప్రస్తుతం రాజ్యంగ పదవుల్లో కొనసాగుతోన్న ఇద్దరు సీనియర్లపై పవన్ కల్యాణ్ తాజాగా ట్వీట్లు చేశారు. వారిద్దరూ కేంద్ర మాజీ మంత్రులే. ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయలను ఉద్దేశించిన పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్లు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ టాపిక్ కాస్తా జనసేన పార్టీ భవిష్యత్తుతో ముడిపడి ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అకాల ట్వీట్లకు అర్థాలేంటీ?
రాజకీయాల్లో గానీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో గానీ కొనసాగుతోన్న నాయకులను ఉద్దేశించి, వారి పుట్టినరోజు లేదా అలాంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శుభాకాంక్షలు తెలపడం లేదా, వారితో తమకు ఉన్న అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకోవడం సహజం. దీనికి భిన్నంగా పవన్ కల్యాణ్ ట్వీట్లు చేశారు. అలాంటి ప్రత్యేక సందర్భాలేవీ లేకుండా వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ట్వీట్లు చేశారు. వారితో కలిసి దిగిన ఫొటోలను వాటికి జత చేశారు. విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో చోటు చేసుకున్న దుర్ఘటనపై బండారు దత్తాత్రేయ తనకు ఫోన్ చేసినట్లు చెప్పుకొన్నారు పవన్ కల్యాణ్.
బీజేపీకి మరింత చేరువ అయ్యేలా..
పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్లు జనసేన పార్టీని బీజేపీకి మరింత చేరువ చేసేలా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామంటూ పవన్ కల్యాణ్ ఇదివరకే ప్రకటించారు. సీట్ల సర్దుబాటు కోసం దేశ రాజధానిలో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సైతం కలిశారు. సీట్ల సర్దుబాటు చేసుకుని, స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగడానికి సన్నాహాలు చేసుకుంటోన్న సమయంలో అవి కాస్తా వాయిదా పడ్డాయి. ఆ తరువాతా ఈ రెండు పార్టీల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి.
ఇదివరకు పాచిపోయిన లడ్డూలంటూ వెంకయ్య నాయుడిపై దాడి..
పవన్ కల్యాణ్ ఇదివరకు వెంకయ్యనాయుడిపై మాటల దాడులను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వెంకయ్య నాయుడు కేంద్రమంత్రిగా కొనసాగుతున్న సమయంలో.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని విమర్శనాస్త్రాలుగా మలిచారు. ప్రత్యేకించి- వెంకయ్య నాయుడిని లక్ష్యంగా చేసుకుని విమర్శలను సంధించారు. పాచిపోయిన లడ్డూలంటూ ఎద్దేవా చేశారు. మాటల తూటాలను సంధించారు. అలాంటి పవన్ కల్యాణ్.. తాజాగా అదే వెంకయ్య నాయుడిని పొగడ్తల్లో ముంచెత్తుతూ ట్వీట్లు చేయడం అందరి దృష్టినీ ఆకట్టుకుంది.
వినయపూర్వక కృతజ్ఙతలంటూ..
వెంకయ్య నాయుడి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, ఆయన ఇచ్చే ప్రతిభావంతమైన సలహాలు, సూచనలు ఆచరణీయమైనవని తన ట్వీట్లో రాసుకొచ్చారు పవన్ కల్యాణ్. వెంకయ్య నాయుడు ఏ విషయంపైనైనా నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడుతుంటారని కితాబిచ్చారు. మొక్కవోని వ్యక్తిత్వం.. విలక్షణ రాజకీయ జీవిత ఆయన సొంతమని, అమ్మ భాషపై అమితమైన మక్కువ.. చతురత నిండిన వాక్చాతుర్యానికి నిలువెత్తు నిదర్శనమనీ పొగడ్తల వర్షాన్ని కురిపించారు. అ ట్వీట్లు కాస్తా పవన కల్యాణ్ ఉద్దేశమేమిటో చెప్పకనే చెప్పినట్టయిందని అంటున్నారు.