దశావతార ఆలయంలో పవన్ కల్యాణ్: అన్నదానం చేసిన జనసేన చీఫ్
గుంటూరు: ఎన్నికల హడావుడి ముగిసింది. సుమారు మూడు నెలల నుంచీ రాజకీయ వాతావరణంలో క్షణం తీరిక లేకుండా గడిపిన రాజకీయ నాయకులు ఎవరికి తోచిన విధంగా వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గుళ్లూ, గోపురాలను సందర్శిస్తున్నారు. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఆయన జిల్లాలోని దశావతార శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి ఆయన నంబూరు సమీపంలో లింగమనేని టౌన్ షిప్ లో ఉన్న ఈ ఆలయానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దశావతార శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన వసతి ఉంది. ఒకరోజు అన్నదానం ఖర్చును పవన్ కల్యాణ్ ఆలయ సిబ్బందికి చెల్లించారు. అనంతరం- తానే స్వయంగా భక్తులకు భోజనాన్ని వడ్డించారు. భక్తులు కూర్చుని ఉన్న టేబుళ్ల వరకూ వెళ్లి, వారికి ప్లేట్లను అందించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు.. పవన్ కల్యాణ్తో కరచాలనం చేయడానికి ఎగబడ్డారు. సెల్ఫీలు, ఫొటోలు దిగడానికి ఉత్సాహం చూపారు. వారికి నిరాశ కలగకుండా పవన్ కల్యాణ్ ఫొటోలు దిగారు.
ఆలయానికి ఎక్కడా లేని ప్రత్యేకత..
దశావతార శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 11 అడుగుల ఎత్తు ఉన్న మూలవిరాట్టు విగ్రహం సాధారణ రూపంలో ఉండదు. దశావతారాలైన మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, వేంకటేశ్వరవతారం, కల్కి అవతారాలు..ఇవన్నీ ఒకే విగ్రహంలో ఉండేలా శ్రీవెంకటేశ్వరుని మూలవిరాట్టు విగ్రహాన్ని మలిచారు. మోకాళ్ల వరకు మత్స్యావతారం, నడుము వరకు కూర్మావతారంలో స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు. విగ్రహానికి ఎనిమిది చేతులను మలిచారు. వామనావతారానికి సూచికగా ఓ చేత్తో గొడుగు, రామావతారానికి సూచికగా బాణం, విల్లంబులు, పరశురామావతారాన్ని సూచిస్తూ మరో చేతిలో గండ్రగొడ్డలి దర్శనం ఇస్తుంది. ఇక కృష్ణావతారానికి సూచికగా నెమలి పింఛం, కల్కి అవతారానికి సూచికగా ఖడ్గం.. విష్ణుమూర్తి చేతిలో ఉండే శంఖు, చక్రాలు మరో రెండు చేతులకు అలంకరించేలా దశావతారాలను ఒకే విగ్రహంలో మలిచారు.