విజయసాయి రెడ్డీ! తాట తీసి కూర్చోబెడతా: పులివెందుల వేషాలు సాగనివ్వను: ఆ మూడు ఫైళ్లపై సంతకాలు: పవన్
Recommended Video
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. ప్రత్యేకించి- వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని టార్గెట్ గా చేసుకుని విమర్శలు సంధించారు. అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై పెద్దగా విమర్శలు చేయకుండా.. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ సీపీని లక్ష్యంగా చేసుకోవడం సరికాదంటూ కామెంట్లు వస్తున్నప్పటికీ.. పవన్ కల్యాణ్ ఖాతరు చేయట్లేదు. ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో ఆయన వైఎస్ఆర్ సీపీ మీదే తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
నారా లోకేశ్ భర్త నారా చంద్రబాబు నాయుడా ..!?
ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోను..
తన చేతిలో పేపర్లు, ఛానళ్లు ఉన్నాయని వైఎస్ఆర్ సీపీ నాయకులు విజయసాయి రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోనని, తాట తీసి కూర్చోబెడతానని హెచ్చరించారు. పులివెందుల వేషాలు సాగనివ్వబోనని అన్నారు. చట్టాన్ని అడ్డు పెట్టుకుని ఆర్థికనేరాలు ఎలా చేయాలో చూపించిన విజయసాయిరెడ్డికి మాట్లాడే హక్కే లేదని చెప్పారు. సాయిరెడ్డి లాంటి వారి కోసమే తాము విశాఖపట్నం లోక్ సభ స్థానంలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను నిల్చోబెట్టామని అన్నారు. దమ్ముంటే విశాఖకు వెళ్లి మాట్లాడాలని సవాల్ విసిరారు పవన్ కల్యాణ్. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున మాగంటి బాబును గెలిపిస్తే, ఆయన లోక్ సభకు వెళ్లి నిద్రపోయారని, అందుకే ఆర్థికవేత్త పత్తిపాటి పుల్లారావును తాము కైకలూరు అభ్యర్థిగా నిలబెట్టామని చెప్పారు.
పినతండ్రి హత్యకు గురైతే పట్టించుకోలేదెందుకు?
సొంత పినతండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైతే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి ఇలాగే ప్రవర్తిస్తారా? అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే, వారిని ఉతికి ఆరేశామని, మెడలు వంచి పని చేయించామని అన్నారు. పాదయాత్రలు చేసి జగన్ సాధించినదేంటీ అని ప్రశ్నించారు. ఏ సమస్య తీర్చమని అడిగినా ప్రతిపక్ష నేత తాము ముఖ్యమంత్రి అయ్యాక చేస్తానంటున్నారని, జనం ఎందుకు ఓటు వేయాలని అని అన్నారు. వార్డు మెంబర్ కూడా లేని జనసేన పార్టీ సమస్యల మీద పోరాటం చేసినట్టు ప్రతిపక్ష నేత ఎందుకు చేయలేకపోయారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
జగన్ గెలవడానికి కేసీఆర్ పెట్టుబడి..
జగన్మోహన్ రెడ్డి గెలవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుబడి పెడుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రజలను బలి చేయడానికి కేసీఆర్.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక్కడ బీసీలుగా ఉన్న వారిని కేసీఆర్ ఒక్క సంతకంతో ఓసీలుగా మార్చారని విమర్శించారు. కేసీఆర్ తో చెప్పి, ఓసీలను బీసీలుగా ఎందుకు మార్చరని పవన్ కల్యాణ్.. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. రాజకీయాలు చంద్రబాబు కుటుంబమో, జగన్ కుటుంబమో చేయాలా? సామాన్యులు చేయకూడడా? అని నిలదీశారు.
ఆ ఫైలు పైనే తొలి సంతకం
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు పింఛన్ ఇచ్చే పథకంపై తొలి సంతకం పెడతానని పవన్ కల్యాణ్ అన్నారు. అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని, తాను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. రైతులకు ప్రతినెలా 5000 రూపాయల పింఛన్ ఇస్తానని అన్నారు. మరో సంతకం.. ఆడపడచులకు రేషన్ బాధలు లేకుండా చేస్తానని అన్నారు. కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా ప్రతినెలా 2,500 నుంచి 3,500 రూపాయలను వారి అకౌంట్ లో జమ చేస్తానని అన్నారు. నగదు బదిలీ పథకంపై మలి సంతకం చేస్తానని అన్నారు. యువత కోసం మూడు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే ఫైలుపై మూడో సంతకం చేస్తానని అన్నారు.