బీఎస్పీకి 21 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలు ఖరారు: సీమలో రెండు, గుంటూరులో ఒకటి!
అమరావతి: జనసేన పార్టీ-బహుజన సమాజ్ వాది పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. బీఎస్పీకి మూడు లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించబోతున్నట్లు జనసేన పార్టీ నాయకులు వెల్లడించారు. చిత్తూరు, తిరుపతి, బాపట్ల లోక్ సభ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. ఈ మూడు చోట్లా తాము అభ్యర్థులను నిలపట్లేదని, బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తామని జనసేన పార్టీ నాయకులు ప్రకటించారు. 21 అసెంబ్లీ స్థానాలు ఏవనేది ఇంకా తెలియాల్సి ఉంది.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పొత్తు కోసం అనూహ్యంగా బీఎస్పీని తెరమీదికి తీసుకొచ్చారు పవన్ కల్యాణ్. బీఎస్పీతో పొత్తుపై ఎక్కడ కూడా చిన్న లీక్ ఇవ్వలేదు. వామపక్షాలతో మాత్రమే పొత్తు ఉంటుందని ముందు నుంచీ చెప్పుకొంటూ వచ్చిన ఆయన.. నేరుగా ఉత్తర్ ప్రదేశ్ వెళ్లారు. రాజధాని లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. పొత్తు కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని ఉమ్మడిగా విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఇవన్నీ అనూహ్యంగా చకచకా సాగిపోయాయి. అప్పటిదాకా- పవన్ కల్యాణ్ బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటున్నారనే విషయం ప్రజలకు తెలియదు.
పవన్కు జగన్ షాక్...జనసేన ప్రకటించిన అభ్యర్థి వైసీపీలోకి..
మాయావతితో భేటీ సందర్భంగానే సీట్ల సర్దుబాటుపైనా తుది నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. బీఎస్పీకి మూడు రిజర్వుడ్ స్థానాలను జనసేన పార్టీ కేటాయించింది. గుంటూరు, తిరుపతి, చిత్తూరు సీట్లలో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఈ మూడింట్లో బీఎస్పీకి చెందిన నాయకులు పోటీ చేస్తారా? లేక జనసేన పార్టీ సూచించిన వారినే బరిలో దింపుతారా? అనేది వెల్లడి కావాల్సి ఉంది.
దీనితో పాటు- 175 లోక్ సభ స్థానాలు ఉండగా.. 21 సీట్లను జనసేన పార్టీ.. బీఎస్పీకి కేటాయించింది. ఏయే అసెంబ్లీ నియోజకవర్గాలనేది ఇంకా ఖరారు చేయలేదు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ బీఎస్పీకి అసెంబ్లీ స్థానాలను కేటాయించే అవకాశం ఉంది. లోక్ సభ తరహాలోనే ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ సీట్లనే బీఎస్పీకి ఇస్తారని చెబుతున్నారు. దీనికోసం జిల్లాలు, ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలవారీగా సీట్ల వడబోతను చేపట్టారు జనసేన పార్టీ నాయకులు. ఒకటి, రెండు రోజుల్లో అసెంబ్లీ స్థానాలపై కసరత్తు పూర్తి చేస్తామని అంటున్నారు.