రావెల! పొద్దున రాజీనామా..మధ్యాహ్నానికి బీజేపీలో!
గుంటూరు: మాజీమంత్రి రావెల కిశోర్బాబు కన్ను ఈ సారి భారతీయ జనతాపార్టీపై పడింది. కాషాయ తీర్థాన్ని పుచ్చుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా- ఆయన బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలుసుకున్నారు. సుమారు 45 నిమిషాల పాటు ముచ్చటించారు. బీజేపీలో చేరాలనే తన కోరికను వెల్లడించగా.. కన్నా లక్ష్మీనారాయణ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఎప్పుడు చేరతారనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
ఇండియన్ రైల్వేస్ మాజీ అధికారి రావెల కిశోర్బాబు రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో ఆరంభమైంది. 2014లో ఆయన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎస్సీ కోటాలో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగారు. అనంతరం ఆయన పనితీరు బాగోలేదనే ఉద్దేశంతో మంత్రివర్గం నుంచి తొలగించారు. ఎలాంటి కారణాలు చూపించకుండా తనను తొలగించడం పట్ల రావెల కిశోర్బాబు కినుక వహించారు. పార్టీకి గుడ్బై చెప్పారు.
అనంతరం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో తన పాత నియోజకవర్గం ప్రత్తిపాడు నుంచి పోటీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయన మూడోస్థానంలో నిల్చున్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపించకపోవడం, స్వయంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణే పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో దారుణంగా ఓడిపోవడం.. రావెల కిశోర్బాబును పునరాలోచింపజేసినట్టుంది.
అందుకే- శనివారం ఉదయం ఆయన పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఇక ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో మిగిలిన పార్టీ బీజేపీ ఒక్కటే. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన వెంటనే కొన్ని గంటల్లోనే ఆయన బీజేపీ గుమ్మం తొక్కారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలుసుకున్నారు. పార్టీలో చేరాలనే తన కోరికను వెల్లడించారు. దీనికి కన్నా లక్ష్మీనారాయణ సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. ఆయన అంగీకరిస్తే- రావెల కిశోర్బాబు ఇక బీజేపీలో చేరడం లాంఛనప్రాయమే అవుతుంది.