Jana Sena: నీది మనిషి పుట్టుకేనా?: పోలీసులను పక్కన పెట్టు..కొట్టుకుందాం: వైసీపీ ఎమ్మెల్యేకు సవాల్..!
గుంటూరు: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహిస్తోన్న ర్యాలీలు, ప్రదర్శనలు రోడ్షోలు.. ఆరంభంలోనే బెడిసి కొడుతున్నాయి. అధికార పార్టీ నాయకులు నోరు జారుతున్నారు. వైఎస్ జగన్ నిర్ణయానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు చేపట్టిన ఆందోళనల పట్ల తమకు ఉన్న అక్కసును, ఆగ్రహాన్ని.. మాటల తూటాల రూపంలో సంధిస్తున్నారు. అవి కాస్తా మిస్ ఫైర్ అవుతున్నాయి.
ద్వారంపూడిపై జనసేన పార్టీ భగ్గు..
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడితో పాటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్పై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ప్రభావం.. తాజాగా ఆ రెండు పార్టీలో కలకలాన్ని రేపుతున్నాయి. ద్వారంపూడిపై ఘాటు వ్యాఖ్యలు చేయడానికి, విమర్శనాస్త్రాలను సంధించడానికి కారణాలయ్యాయి. పవన్ కల్యాణ్పై ద్వారంపూడి చేసిన తిట్ల పురాణంపై జనసేన పార్టీ నాయకులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. అదే తరహాలో ఎదురుదాడికి దిగుతున్నారు.
నీది మనిషి పుట్టుకేనా..అంటూ
జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్.. ద్వారంపూడిని లక్ష్యంగా చేసుకుని ఘాటుగా విమర్శలు చేశారు. బూతులు తిట్టారు. `నీది అసలు మనిషి పుట్టుకేనా?..ఎలా కన్నావు తల్లి వీడిని..` అంటూ విరుచుకుపడ్డారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో శ్రీనివాస్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులు, కేసులు లేకుండా చేస్తే.. తన తడాఖా ఏమిటో చూపిస్తానని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
కాకినాడకే వస్తా.. కొట్టుకుందాం..
రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ ప్రాంతంలోనైనా ద్వారంపూడితో గానీ, వైఎస్ఆర్సీపీ నాయకులతో గానీ ఏ అంశంపైనా గానీ, బహిరంగ చర్చలకు తాము సిద్ధమని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. విధానపరమైన అంశాలపై చర్చించడానికి ద్వారంపూడి చర్చకు సిద్ధంగా లేకపోతే.. బూతులు తిట్టుకోవడానికైనా, కొట్టుకోవడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాకినాడలోనే తేల్చుకుందామని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహేతుకమే అయినప్పటికీ.. బూతులు తిట్టడం సరికాదని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపిస్తాం..
త్వరలో నిర్వహించబోయే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అధికారం ఉందనే మదంతోనే వైఎస్ఆర్సీపీ నాయకులు కన్ను, మిన్ను కనపించకుండా తిడుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులకు చుక్కలు చూపుతామని అన్నారు. ప్రజల కోసం తాము ఎంత కష్టమైనా పడతామని, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పారు. ద్వారంపూడి వంటి పిచ్చికుక్కలకు తాము భయపడబోమని అన్నారు.