తెనాలి ఆసుపత్రి: పీపీఈ కిట్లు లేక..రెయిన్ కోట్లతో పేషెంట్లకు వైద్యం: ఆపదలో వారియర్స్: జనసేన
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స అందిస్తోన్న నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లకు ప్రభుత్వం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లను అందజేయలేకపోతోందని జనసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. పీపీఈ కిట్లు లేకపోవడం వల్ల ఫ్రంట్లైన్ వారియర్లు రెయిన్ కోట్లను ధరించి.. పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఫలితంగా- వారంతా ఆపదలో చిక్కుకుంటున్నారని చెప్పారు.
తెనాలి ఆసుపత్రిలో నెలకొన్న తాజా పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో రోజూ వేల కొద్దీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రంట్లైన్ వారియర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 88 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పించాల్సి ఉందని అన్నారు.
ప్రాణాలకు తెగించి వైద్య సేవలను అందిస్తోన్న డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లకు అవసరమైన రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. పీపీఈ కిట్లు లేక రెయిన్ కోట్లను ధరించి తెనాలి ఆసుపత్రిలో ఫ్రంట్లైన్ వారియర్లు పని చేస్తున్నారని చెప్పారు. గ్లౌజులు, శానిటైజర్లను సొంత డబ్బులతో కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ కూడా లేరని నాదెండ్ల మనోహర్ అన్నారు.
Recommended Video
200 పడకల సామర్థ్యం ఉన్న తెనాలి ఆసుపత్రిలో చాలినంత మంది డాక్టర్లు, నర్సులు లేకపోవడం వల్ల ఉన్నవారిపై పని ఒత్తిడి పెరుగుతోందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఫలితంగా- పేషెంట్లకు నాణ్యమైన వైద్య సహాయం అందకపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఫ్రంట్లైన్ వారియర్లకు అవసరమైన పీపీఈ కిట్లను అందజేయాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో ఓ జర్నలిస్ట్, తిరుపతిలో టీటీడీ ఉద్యోగి ఆక్సిజన్ కొరత వల్ల చనిపోయారని అన్నారు. వెంటనే ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లోనూ హౌస్ సర్జన్లకు స్టైపెండ్ చెల్లించకపోవడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.