Pawan Kalyan: పవన్ కీలక నిర్ణయం.. ఇక జనంలోనే..సర్కార్ కు సినిమానే: కొత్తగా అయిదుమంది..!
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీని విస్తరించారు. కొత్తగా అయిదుమందికి చోటు కల్పించారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వారితో పాటు- అధికార ప్రతినిధులుగా ముగ్గురిని కొత్తగా నియమించారు. వారి పేర్లను ప్రకటించారు. భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావాన్ని తెలుపుతూ ఈ నెల 3వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్ దిగ్విజయమైందని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రభుత్వ వైఖరిని దనుమాడుతూ చేపట్టిన ఈ ఆందోళనను విజయవంతం చేయడానికి పార్టీ తరఫున కృషి చేసిన నాయకులకు ఆయన కృతజ్ఞతతు తెలిపారు.
పవన్ ఎప్పుడు ఎవరికి తాళి కడతారో అంటూ ... వ్యక్తిగత విమర్శలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే
పంతం నానాజీ, పితాని బాలకృష్ణలకు ఛాన్స్..
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో కొత్తగా అయిదుమందిని తీసుకున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. పంతం నానాజీ, మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పితాని బాలకృష్ణలకు కొత్తగా చోటు కల్పించినట్లు చెప్పారు. రాజకీయ వ్యవహారాల కమిటీని విస్తరించాలనే ఉద్దేశంతోనే వారికి ఇందులోకి తీసుకున్నామని అన్నారు. ఈ కమిటీకి నాదెండ్ల మనోహర్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ ను విజయవంతం కావడానికి అహర్నిశలు పని చేసిన సత్య బొలిశెట్టి, శివశంకర్ తమ్మిరెడ్డిలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. త్వరలోనే వీరిద్దరికీ పార్టీలో కీలక పదవులు, కొత్త బాధ్యతలను అప్పగిస్తానని చెప్పారు.
అధికార ప్రతినిధులుగా..
పార్టీ అధికార ప్రతినిధులుగా సుజాత పండ, సుందరాపు విజయ్ కుమార్, పరుచూరి భాస్కర్ రావులను నియమించారు. తమ శక్తివంచన లేకుండా వారు పార్టీ అభివృద్ధికి కృషి చేశారని, పార్టీ గళాన్ని గట్టిగా వినిపించారని పవన్ కల్యాణ్ అభినందించారు. ఇకముందు కూడా పార్టీ అధికార ప్రతినిధులుగా తమ వైఖరిని, పార్టీ నిర్ణయాలను జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వారిపై ఉందని చెప్పారు. లాంగ్ మార్చ్ ను అంచనాలకు మించి విజయవంతం చేసిన జన సైనికులు, వీర మహిళలలకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నాని అన్నారు.
ఇక నుంచి జనంలోనే..
విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ విజయవంతమైన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. దీన్ని ఇలాగే కొనసాగిస్తామని, దీనికోసం సరి కొత్త వ్యూహాలను రూపొందించుకుంటున్నామని చెప్పారు. జనంతో మమేకం అయ్యేలా ప్రణాళికలకు రూపకల్పన ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ, ఎలాంటి సమస్య తలెత్తినా తాము ఉన్నామనే ధైర్యం ప్రజలకు ఇస్తామని అన్నారు. దీనికోసం జన సైనికులు, వీర మహిళలు ముందుండాలని సూచించారు. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని, వాటిని జనంలోకి తీసుకెళ్తామని చెప్పారు.