Rapaka Varaprasad: జనసైనికులు నన్ను ట్రోల్ చేస్తున్నారు..వారికి చెప్పేదొకటే: రాపాక..!
అమరావతి: జనసేన పార్టీ శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ ను సొంత పార్టీ కార్యకర్తలు టార్గెట్ చేస్తున్నారట. రాపాక వరప్రసాద్ రాజీనామా చేశారంటూ వదంతులను పుట్టిస్తున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేగా తాను రాజీనామా చేస్తున్నానని అంటూ రకరకాల క్యాప్షన్లు పెట్టి కొందరు జన సైనికులు పక్కదారి పట్టించే విధంగా ట్రోలింగ్ మొదలు పెట్టారని రాపాక వరప్రసాద్ అన్నారు.
*నా రాజీనామా అంటూ రకరకాల క్యాప్షన్స్ పెట్టి జనసైనికులు ప్రక్కదారి పట్టించే విధంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు, నా పై దృష్టి పక్కనపెట్టి రేపు జరగబోయే "రైతు సౌభాగ్య దీక్ష" కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి రైతులకి అండగా నిలిచి, వారి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయండి
— Rapaka Varaprasada Rao (@JspVaraPrasad) December 11, 2019
కారణాలూ ఆయనే చెప్పేశారు..
కొంతకాలంగా తాను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం, కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడటమే పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమై ఉంటుందని చెప్పారు. మొన్నటికి మొన్న రాపాక వరప్రసాద్.. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ ను ప్రశంసించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధనను అమలు చేయాలనే నిర్ణయంపై నిండుసభలో ఆయన వైఎస్ జగన్ ప్రశంసించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
దళిత విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం వద్దా?
రాజీనామా అంటూ ట్రోల్ చేస్తోన్న వారికి తాను చెప్పేదొకటేనని, దళిత, పేద విద్యార్థులు ఇంగ్లీషు మీడియంలో చదువుకోకూడదా? అని ప్రశ్నించారు. ఓ దళిత ఎమ్మెల్యేగా దళిత, పేద విద్యార్థులు ఏ రంగంలో కూడా వెనకబడకూడదని తాను ఆశిస్తున్నానని అన్నారు. అందరితో సమానంగా వారు ఇంగ్లీషు విద్యను అభ్యసించాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఈ పోటీ ప్రపంచంలో రాబోయే భవిష్యత్లో అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలనే మంచి ఉద్దేశంతో తాను ప్రభుత్వాన్ని బలపరిచానని వివరణ ఇచ్చుకున్నారు.
తెలుగును విస్మరించమని చెప్పలేదే..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధనను అమలు చేయడం వల్ల తెలుగు భాషకు ఎలాంటి ఇబ్బందులు రావని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు రాపాక చెప్పుకొచ్చారు. తెలుగుని విస్మరించమని, తెలుగు సంస్కృతిని పక్కనపెట్టి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కొనసాగించాలని తాను ఎక్కడా చెప్పలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలుగును కూడా తప్పనిసరిగా పాఠ్యాంశంగా ప్రభుత్వం చేర్చిందని చెప్పారు.
రైతు సౌభాగ్య దీక్షకు గైర్హాజర్ కావడం వల్లేనా?
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాకినాడలో రైతు సౌభాగ్య దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ దీక్ష కొనసాగుతోంది. దీనికి రాపాక వరప్రసాద్ గైర్హాజర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున తాను రైతు సౌభాగ్య దీక్షకు హాజరు కావట్లేదని ఆయన వెల్లడించారు. అదే సమయంలో ఆయన వైఎస్ జగన్ ప్రశంసిచడం.. జనసేన పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఉంటుందని అంటున్నారు.