జనసేన ఎమ్మెల్యే రాపాక ఉగ్రరూపం: టీడీపీ సభ్యులపై ఘాటు విమర్శలు!
అమరావతి: జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. సాధారణంగా పెద్దగా ఎక్కడా ఉద్వేగానికి గురి కారు. ఎంత తీక్షణ విషయాన్నయినా తనదైన శైలిలో వ్యక్తం చేస్తుంటారు. కోపతాపాల జోలికి పోరు. జరగని విషయాల గురించి అనవసరంగా హైరానా పడటం ఎందుకంటూ ఆయన ఇదివరకే కొన్ని సందర్భాల్లో ప్రస్తావించారు కూడా. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంటూ వచ్చిన వార్తలపైనా ఆయన బిందాస్గా సమాధానాలను ఇచ్చుకుంటూ వెళ్లారే తప్ప, అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు తక్కువే.
అనవసరంగా ఉపేక్షిస్తున్నారంటూ..
అలాంటి రాపాక.. బుధవారం ఆగ్రహోదగ్రుడయ్యారు. ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులను అనవరసంగా ఉపేక్షిస్తున్నారంటూ మండిపడ్డారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పట్టుబట్టారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉద్దేశపూరకంగా సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. స్పీకర్ వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
తక్కువ మందే ఉన్నా ఎక్కువ అల్లరి వారిదే..
తెలుగుదేశం పార్టీ సభ్యులు సభలో తక్కువ మందే ఉన్నారని, అయినప్పటికీ.. అందరి కంటే ఎక్కువగా అల్లరి చేస్తున్నారని రాపాక వరప్రసాద్ మండిపడ్డారు. రైతు భరోసా, ఎస్టీ, ఎస్టీ కమిషన్ వంటి కీలక అంశాలపై సభలో చర్చిస్తుండగా.. టీడీపీ సభ్యులు ఉద్దేశపూరకంగా సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చర్చను పక్కదారి పట్టించడానికి వృధా ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
స్పీకర్పైనే దాడి చేసేలా..
టీడీపీ సభ్యుల పనితీరు స్పీకర్ తమ్మినేని సీతారాం మీద దాడి చేసేలా ప్రవర్తిస్తున్నారని రాపాక విమర్శించారు. వారిపై చర్య తీసుకోవాలని ఆయన పట్టుబట్టారు. ముఖ్యమంత్రి చేస్తున్న మంచి కార్యక్రమాలు జనంలోకి వెళుతున్నాయని, ఆ ఆగ్రహంతోనే వారు ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని కానప్పటికీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న మంచి నిర్ణయాలు, ప్రజలకు మేలు చేసే పనులను ప్రశంసిస్తున్నానని చెప్పారు. మంచి ఎవరు చేసినా మెచ్చుకోవాల్సిందేనని చెప్పారు.