Rapaka Varaprasad: శాసన మండలి రద్దుకు మద్దతు: పెద్దల సభ పేరుతో అడ్డుకుంటున్నారు: రాపాక
అమరావతి: జనసేన పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన శాసన మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా మాట్లాడారు. ఈ తీర్మానానికి తాను మద్దతు పలుకుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును మండలి సభ్యులు అడ్డుకోవడం సరికాదని అన్నారు.
చంద్రబాబు చెప్పిందే మేం చేస్తున్నాం: సిద్ధాంతపరంగా మండలి వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం: ధర్మాన
అధికార, అభివృద్ధి వికేంద్రీకరణకు అవకాశం..
రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ అవసరమని రాపాక వరప్రసాద్ అన్నారు. అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ కార్యక్రమాలను చేపట్టడం వల్లే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించగలుగుతుందని చెప్పారు. అలాంటి నిర్ణయాన్ని తీసుకోవడంతో పాటు బిల్లును కూడా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తాను అభినందిస్తున్నానని అన్నారు.
అభివృద్ధిని 13 జిల్లాలకూ విస్తరించడానికి..
కోస్తా ఆంధ్రతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు అభివృద్ధిని సాధించాలంటే వికేంద్రీకరణ తప్పనసరి అని ఆయన చెప్పారు. అభివృద్ధిని ఒకే చోటు కేంద్రీకరించకూడదని, 13 జిల్లాలకు విస్తరింపజేయాలనే నిర్ణయానికి తాను మద్దతు ఇస్తున్నానని రాపాక తెలిపారు. అన్ని ప్రాంతాలను అభిృద్ధి చేయడానికి ఉద్దేశించిన వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిని అడ్డుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
పెద్దల సభ పేరుతో అడ్డుకోవడం సరికాదు..
ప్రస్తుత శాసనసభలో మేధావులు, ఉన్నత విద్యావంతులు, రాజకీయ ఉద్దండులు ఉన్నారని, అలాంటప్పుడు పెద్దల సభ పేరుతో శాసన మండలిని కొనసాగించాల్సిన అవసరం లేదని రాపాక అభిప్రాయపడ్డారు. ఇంతమంది చదువుకున్న వారు సభ్యులుగా ఉన్న శాసనసభకు పైన మరో శాసన మండలి ఉండాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని, అది సమంజసం కాదని అన్నారు. ఇంతమంది సమర్థులు ఉన్న సభలో తీసుకున్న నిర్ణయాన్ని, ఆమోదించిన బిల్లును శాసన మండలి తిరస్కరించడం సరికాదని చెప్పారు.
ఇంగ్లీష్ మీడియాలో విద్యాబోధన బిల్లుకూ తిరస్కారమేనా?
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్లో విద్యాబోధనను చేయడానికి ఉద్దేశించిన బిల్లును కూడా శాసన మండలి తిరస్కరించిందని రాపాక వరప్రసాద్ గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లల్లో ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్నారని, ఇంగ్లీష్లో చదువు చెప్పడం వల్ల వారంతా రాణించగలుగుతారని అన్నారు. ఉన్నత వర్గ ప్రజలతో సమానంగా పేద పిల్లలు చదువుకోగలరని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ఈ బిల్లును సమర్థించారని, ఆయన సారథ్యాన్ని వహిస్తోన్న తెలుగుదేశం పార్టీ సభ్యులు శాసన మండలిలో వ్యతిరేకించారని అన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలపై టీడీపీకి ఉన్న ప్రేమ అలాంటిదని రాపాక ఎద్దేవా చేశారు.
పెద్దల సభ పేరుతో అడ్డుకుంటున్నారు: రాపాక
— Oneindia Telugu (@oneindiatelugu) January 27, 2020
# RapakaVaraprasad #YSJagan #JanaSenaParty pic.twitter.com/XCD7H4tVU1