కొరుకుడు పడని రాపాక: బీజేపీతో భేటీకి దూరంగా: రాజధానిగా అమరావతి కొనసాగింపుపై..!
విజయవాడ: జనసేన పార్టీ రాజకీయ భవిష్యత్తును నిర్ధారించే సమావేశం అది. భారతీయ జనతా పార్టీతో కలిసి ఉమ్మడిగా పోరాటం సాగించడానికి బీజం పడిన కీలక భేటీ అది. అటు జనసేన, ఇటు బీజేపీ రాష్ట్రశాఖ అగ్ర నాయకులు వేదికను పంచుకున్న సందర్భం అది. రాజకీయంగా ఈ రెండు పార్టీలకూ అత్యంత కీలకంగా మారిన ఈ సమావేశానికి జనసేనకు చెందిన ఏకైక శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ గైర్హాజర్ కావడం.. అంతే ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
రాపాక డుమ్మా వెనుక..
తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. జనసేన పార్టీ అగ్ర నాయకత్వానికి ఏ మాత్రం కొరుకుడు పడట్లేదు. పార్టీ అగ్ర నాయకులు తీసుకుంటోన్న ఏ ఒక్క నిర్ణయాన్ని ఆయన సమర్థించట్లేదు. పైగా- విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యనూ ఆయన ప్రశంసిస్తున్నారు. నిండు అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ను దేవుడిగా కీర్తించారు.
పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా..
రాపాక వరప్రసాద్ ముందు నుంచీ జనసేన పార్టీలో అంటీముట్టనట్గుగానే వ్యవహరించడానికి కారణాలు లేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ వ్యతిరేకించాల్సిందేనంటూ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గానీ, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గానీ చేసిన సూచనలను ఆయన ఏనాడూ పట్టించుకోలేదు. పార్టీ సి్ధాంతాలకుక వ్యతిరేకంగా, ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా నడిచారు. ముఖ్యమంత్రి నిర్ణయాల్లో ఏ ఒక్క దాన్ని కూడా తప్పు పట్టలేమని రాపాక వరప్రసాద్ ముందు నుంచీ చెబుతూనే వస్తున్నారు.
రాజధానిగా అమరావతి కొనసాగింపుపైనా..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా రాపాక వరప్రసాద్ బహిరంగంగా స్వాగతించారు. పార్టీ ఎమ్మెల్యే హోదాలో ఆయన అసెంబ్లీలో వైఎస్ జగన్పై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. మూడు రాజధానుల ఏర్పాటు వల్ల మూడు ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందుతాయని మొదటి నుంచీ చెబుతూనే వస్తున్నారు. అభివృద్ధిని, పరిపాలనను వికేంద్రీకరించడాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పుకొచ్చారు.
పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి..
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు కొద్ది రోజుల కిందటే ఓ రాజకీయ తీర్మానాన్ని చేసిన విషయం తెలిసిందే. రాపాక వరప్రసాద్ అప్పట్లోనే దీన్ని తప్పు పట్టారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ్ ప్రాంతాలు అభివృద్ధి చెందడం బీజేపీకి ఏ మాత్రం ఇష్టం లేదని విమర్శించారు. అలాంటి బీజేపీతో తన సొంత పార్టీ కలిసి నడవాలని అనుకోవడం, దీనికోసం కమల నాథులతో భేటీ కావడం రాపాకకు ఇష్టం లేదని, అందుకే ఆయన ఈ సమావేశానికి డుమ్మా కొట్టారని అంటున్నారు.
ఇక ముందు కూడా పార్టీ వెంట నడవడం కష్టమే..
జనసేన, బీజేపీ సమావేశానికి డుమ్మా కొట్టడం ద్వారా రాపాక వరప్రసాద్.. తన ఉద్దేశమేంటనేది చెప్పకనే చెప్పినట్టయింది. ఇక ముందు కూడా ఆయన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడచుకోవడం ఖాయమైందనే అనుకోవచ్చు ఈ ఘటన ద్వారా. పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్ కల్యాణ్ జారీ చేసే ఏ ఒక్క వ్యవస్థాగతమైన నిర్ణయాన్ని కూడా రాపాక వరప్రసాద్ మనస్ఫూర్తిగా స్వాగతించలేకపోవచ్చని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.