ఏ గట్టునుంటాడో..రాపాక: కమలంతో కలవలేక సతమతం: జనసేన పీఏసీ అత్యవసర భేటీ ఏం చేస్తుందో..!
విజయవాడ: భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, వేడెక్కిన పరిస్థితుల మధ్య జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసరంగా సమావేశం కానుంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సాగే ఈ సమావేశానికి అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సహా పలువురు నాయకులు హాజరు కానున్నారు.
వేడెక్కిస్తోన్న అసెంబ్లీ స్పెషల్ సెషన్..
సోమవారం రాష్ట్ర శాసనసభ సమావేశం కానుంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం, ఇదే అంశంపై రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ కమిటీ నివేదికలు ప్రభుత్వం చేతికి అందడం, హైపవర్ కమిటీ భేటీ, రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల రైతులు నిరసన ప్రదర్శనలకు దిగడం.. వంటి కీలక పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతుండటం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
బీజేపీతో పొత్తుపై..
ఈ పరిణాలు ఒకవంక కొనసాగుతుండగానే.. మరోవంక- జనసేన పార్టీ అనూహ్యంగా రాజకీయ ఎత్తుగడ వేసింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రాజకీయ తీర్మానాన్ని చేసిన బీజేపీ నాయకులతో కలిసి ప్రయాణించాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా జనసేన పార్టీ తన ఉద్దేశమేమిటో చెప్పకనే చెప్పినట్టయింది. మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని తాము నిర్ద్వందంగా తోసిపుచ్చుతున్నట్లు స్పష్టం చేసింది జనసేన.
అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని..
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను దృష్టిలో ఉంచుకుని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసరంగా సమావేశం కానుంది. మూడు రాజధానుల ఏర్పాటు, అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలు, బీజేపీతో పొత్తు వంటి కీలక అంశాలు ఈ భేటీ సందర్భంగా చర్చకు రానున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి గల నిర్దుష్ట కారణాలను కూడా ఈ సమావేశంలో వెల్లడించడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్రబిందువుగా రాపాక..
జనసేన పార్టీ తరఫున అసెంబ్లీకి ఎన్నికైన ఏకైకక సభ్యుడు రాపాక వరప్రసాద్ను కేంద్ర బిందువుగా చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే చాలా అంశాలు, కీలక సందర్భాల్లో రాపాక.. పార్టీ అగ్ర నాయకత్వం అభీష్టానికి వ్యతిరేకంగా నడచుకున్నారు. నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఆకాశానికెత్తేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసిన సందర్భాలు లేకపోలేదు.
రాపాకపై చర్యకు అవకాశం..
ఈ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసర సమావేశంలో రాపాక వైఖరినీ చర్చిస్తారని అంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పట్ల ఆయన బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇటీవలే. దీనికితోడు- మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతించారు. మూడు రాజధానుల విషయంలో పార్టీ అగ్ర నాయకత్వాన్ని సైతం ధిక్కించారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలను వ్యతిరేకంగా ప్రవర్తిస్తారంటూ ఇప్పటికే రాపాకపై ఫిర్యాదులు అందాయి. వాటిని ఆధారంగా చేసుకుని ఆయనపై చర్యకు దిగొచ్చని అంటున్నారు.