బీజేపీ తరఫున పవన్ కల్యాణ్కు కొత్త బాధ్యతలు: స్టార్ క్యాంపెయినర్గా: కర్ణాటకలో కూడా..!
అమరావతి: కమలంతో కలిసి ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు కొత్త బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. టాప్ హీరోగా మాస్ అప్పీల్ ఉండటం, లక్షలాది మంది అభిమానులు, క్యాడర్ ఉండటం వల్ల ఈ బాధ్యతలకు పవన్ కల్యాణ్ అతికినట్టు సరిపోతారని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ రూట్ మ్యాప్ను రూపొందించే పనిలో పడ్డారు.
పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల ప్రచారకర్తగా..
దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రదర్శనలు, ఆందోళనలను చెలరేగుతున్న విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్నప్పటికీ.. ఈ ఆందోళనలకు సంబంధించిన తీవ్రత తగ్గట్లేదు. దేశ రాజధాని సహా కొన్ని రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ప్రదర్శనలు కొనసాగుతూనే వస్తున్నాయి. దీనికి కౌంటర్గా బీజేపీ కూడా అనుకూల ప్రచార కార్యక్రమాలను చేపట్టింది.
స్టార్ క్యాంపెయినర్గా
పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా ప్రచారం చేయడానికి పవన్ కల్యాణ్ సేవలను ఉపయోగించుకోవాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఈ ప్రచారానికి ఆయనను స్టార్ క్యాంపెయినర్గా మార్చే అవకాశాలు లేకపోలేదు. ప్రధాన ప్రచారకర్తగా బాధ్యతలను అప్పగించవచ్చని తెలుస్తోంది. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న వెంటనే ఏర్పాటు చేసిన ఉమ్మడి విలేకరుల సమావేశంలో కూడా పవన్ కల్యాణ్.. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం.. ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోంది.
కర్ణాటకలో కూడా..
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ పవన్ కల్యాణ్..పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించవచ్చని అంటున్నారు. తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ ద్వారా ప్రచారాన్ని చేయించడానికి బీజేపీ నాయకులు కసరత్తు చేసే అవకాశాలు లేకపోలేదు. బెంగళూరులో ప్రస్తుతం పౌరసత్వ వ్యతిరేక ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ ద్వారా అనుకూల ప్రచారానికి తెర తీయొచ్చని తెలుస్తోంది.
ఇక ఉమ్మడిగా..
బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. కమలనాథులతో కలిసి ఉమ్మడిగా ప్రతి పోరాటంలోనూ పాల్గొనాల్సి రావడం ఖాయమైంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల జోరు కొనసాగుతున్నందున.. ఇక అక్కడ బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుందని అంటున్నారు. ఇందులో భాగంగా- పవన్ కల్యాణ్ త్వరలో తెలంగాణలో పర్యటించవచ్చని సమాచారం.