Rythu Soubhagya Deeksha: జనసేన రైతు సౌభాగ్య దీక్ష.. పోస్టర్ ఇదే: 151 మంది ఉండి ఏం లాభం: పవన్
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభుత్వంపై పోరాటానికి సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఆయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ పోరాటానికి రైతు సౌభాగ్య దీక్షగా నామకరణం చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను మంగళవారం పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఉదయం 8 గంటలకు ఈ దీక్ష ఆరంభమౌతుందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జన సైనికులు ఈ దీక్షా శిబిరానికి తరలి రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
'జగనన్న ఉల్లిపాయల పథకం’ అని పెట్టుకోండి: ప్రాణాలు పోతున్నా అంటూ పవన్ కళ్యాణ్ ఫైర్
151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా..
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అయినప్పటికీ.. వారి వల్ల రైతులు, సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. వరిని పండించడానికి రైతులు భయపడేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆరోపించారు. రైతుల దుస్థితిని జగన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ నెల 12వ తేదీన కాకినాడలో ఒక రోజు నిరాహార దీక్ష చేయాలని సంకల్పించానని అన్నారు.
మూడు రోజుల్లో పరిష్కరించాలని డిమాండ్ చేశా..
తూర్పు గోదావరి జిల్లాలో తాను విస్తృతంగా పర్యటించానని, పలువురు రైతులను ప్రత్యక్షంగా కలుసుకొన్నానని చెప్పారు. వారు దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారని చెప్పారు. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు వందల్లో ఉన్నాయని, వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే తాను నిరాహార దీక్షను చేపట్టినట్లు తెలిపారు. మండపేటలో జరిగిన రైతు సమావేశంలో మూడు రోజులలో రైతుల సొమ్ము వారి బ్యాంకు ఖాతాలలో వేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశానని, అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపించారు.