ఆ ఘనత ఎవరి ఖాతాలో: తాను చేసిన ట్వీట్ వల్లేనంటోన్న పవన్ కల్యాణ్: కిషన్ రెడ్డి ఏం చెబుతున్నారు?
అమరావతి: రాష్ట్రంలో మరోసారి పొలిటికేల్ గేమ్ మొదలైంది. ప్రజల సంక్షేమ కార్యక్రమాల్లోనూ ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా తాము పని చేస్తున్నామనే విషయాన్ని అన్ని పార్టీలు కూడా స్పష్టం చేశాయి. ఇదివరకు ఇలాంటి సందర్భాలు అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా మత్స్యకారుల తరలింపు వ్యవహారం కూడా దీనికి కేంద్రబిందువు అయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వేలాది మంది మత్స్యకారులను రాష్ట్రానికి తరలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేశాయి. ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలుగా కాకుండా.. పార్టీల కోణంలో దీన్ని చూస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
స్వరాష్ట్రానికి ఉత్తరాంధ్ర మత్స్యకారులు..
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మూడువేల మందికి పైగా మత్స్యకారులు గుజరాత్లోని వెరావల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. జీవనోపాధిని వెదుక్కుంటూ గుజరాత్కు వెళ్లిన వారంతా తీర ప్రాంత పట్టణం వెరవల్లో చేపలను వేటాడుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. చేపల వేటను నిషేధించడం వల్ల ఉపాధిని కోల్పోయారు. వారిని స్వరాష్ట్రానికి తీసుకుని రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేశాయి.
విజయ్ రుపాణికి జగన్ ఫోన్..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీతో ఫోన్లో మాట్లాడారు. లాక్డౌన్ అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వారిని స్వరాష్ట్రానికి పంపించడానికి సహకరించాలని కోరారు. గుజరాత్ ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. దీనితో మానవతా దృక్పథంతో స్పందించింది కేంద్రం. మత్స్యకారులందర్నీ స్వరాష్ట్రానికి పంపించడానికి 64 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మత్స్యకారులను స్వరాష్ట్రానికి తీసుకుని రావడానికి అయ్యే ఖర్చును ఏపీ ప్రభుత్వం భరించింది. దీనికోసం మూడు కోట్ల రూపాయలను విడుదల చేసింది జగన్ ప్రభుత్వం.
తన ట్వీట్ వల్లేనంటూ పవన్ కల్యాణ్..
అక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ.. ఆ తరువాతే పొలిటికల్ గేమ్ ఆరంభమైంది. మత్స్యకారులను స్వరాష్ట్రానికి రప్పించిన ఘనతను తమ ఖాతాలో వేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఉబలాట పడుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం అదే తరహాలో ప్రయత్నాలను చేసుకుంటోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ అడుగు ముందుకేశారు. తాను ట్విట్టర్లో చేసిన విజ్ఙప్తికి కేంద్రం, ఏపీ ప్రభుత్వం స్పందించాయని, వారికి తాను కృతజ్ఙతలు తెలుపుకొంటున్నానని అన్నారు. జనసేన పార్టీకి చెందిన శ్రీకాకుళం జిల్లా నాయకులు గుజరాత్లో చిక్కుకుపోయిన మత్స్యకారుల గురించి తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు.
వారికి థ్యాంక్స్..
వారిని స్వరాష్ట్రానికి తీసుకుని రావాలని కోరుతూ తాను వెంటనే ట్విట్టర్ ద్వారా విజ్ఙప్తి చేశానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. దీనిపై ఆయన తాజాగా మరో ట్వీట్ చేశారు. తక్షణమే స్పందించి, వారిని ఆదుకున్నందు వల్ల గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపాని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, సహాయమంత్రి జీ కిషన్ రెడ్డిలకు కృతజ్ఙతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. వారికి స్వరాష్ట్రానికి తీసుకుని రావడానికి మూడు కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఏపీ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెబుతున్నట్లు పవన్ కల్యాణ్ తన తాజా ట్వీట్లో వెల్లడించారు.
Recommended Video
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సాధ్యం..
మూడువేల మందికి పైగా ఉన్న మత్స్యకారులను స్వరాష్ట్రానికి తరలించడంలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన స్పందించాయని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. రెండురోజులుగా తాము ఈ పనుల మీదే ఉన్నామని అన్నారు. 35 రోజులుగా వారు గుజరాత్లో చిక్కుకునిపోయారని చెప్పారు. వారిని తరలించడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో మాట్లాడామని అన్నారు. గుజరాత్, ఏపీ ప్రభుత్వాలు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఉమ్మడిగా కృషి చేశాయని ఆయన పేర్కొన్నారు. మూడు దశల్లో వారిని స్వరాష్ట్రానికి పంపిస్తామని అన్నారు.