ఏపీ బీజేపీకి కొత్త చీఫ్: పొత్తుపై కుండబద్దలు కొట్టిన పవన్ కల్యాణ్: రాజకీయ ప్రయాణంపై!
అమరావతి: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, ఆయా రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు వరుస బెట్టి అభినందనలను కురిపిస్తున్నారు. ఏపీ బీజేపీ నేతల మాట సరేసరి. పార్టీ తాజా మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా పలువురు నేతలు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆ జాబితాలో చేరారు. సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీతో పొత్తు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. పార్టీ అధ్యక్షుడు మారినంత మాత్రాన పొత్తు విషయాన్ని పునఃసమీక్షించలేమనే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సోము వీర్రాజుతో కలిసి పని చేస్తామని, ముందుకు సాగుతామని పవన్ కల్యాణ్ కుండ బద్దలు కొట్టారు.
ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా పగ్గాలను అందుకోబోయే నాయకుడికి మరో రాజకీయ పార్టీ నుంచి శుభాకాంక్షలు రావడం, అభినందనలు తెలియజేయడం చాలా అరుదు. ఒక రాజకీయ పార్టీని.. మరో రాజకీయ పార్టీ ప్రత్యర్థిగా చూస్తుందే తప్ప పార్టీ పరంగా సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి ఏ మాత్రం ఇష్టపడదు. వ్యక్తిగతంగా స్నేహం ఉన్నప్పటికీ.. రాజకీయాల దగ్గరికి వచ్చే సరికి ప్రత్యర్థిగానే భావిస్తారు.
ఈ ఆనవాయితీని బ్రేక్ చేశారు పవన్ కల్యాణ్. సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు. సోము వీర్రాజుకు శుభాకాంక్షలను తెలియజేశారు. జనసేన, బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతోంది. భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చినా ఉమ్మడిగా ఢీ కొట్టాలని నిర్ణయించుకున్నాయి. సీట్లు సర్దుబాటు చేసుకోనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్.. ఆయనకు గ్రీటింగ్ తెలిపారు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న నాయకుడని పవన్ కల్యాణ్ చెప్పారు. నాయకత్వ లక్షణాలు, సేవా తత్పరత ఉన్నాయని అన్నారు.
Recommended Video
ఆయన నాయకత్వంలో బీజేపీ మరిన్ని విజయాలను సాధించాలని తాను కోరుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. సోము వీర్రాజు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చారని, క్షేత్రస్థాయిలో పేద వర్గాల సమస్యలపై ఆయనకు అవగాహన ఉందని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తమ పార్టీ సోము వీర్రాజు నాయకత్వంలోని బీజేపీతో కలిసి పని చేస్తాయని అన్నారు. బీజేపీతో కలిసి రాజకీయ ప్రయాణాన్ని సాగిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.