జగన్ సర్కార్ నిర్వాకం: ముస్లిం, బీసీలు రోడ్డు మీదికి: సంపదను సృష్టించడం చేతకాదా?: పవన్
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వల్ల వందలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం నెలకొని ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా కుటుంబాలన్నీ పేద ముస్లిం, బీసీ వర్గాలకు చెందినవేనని చెప్పారు. సంపదను సృష్టించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యపడట్లేదని, అందుకే ప్రభుత్వ భూములను తెగనమ్మి మరీ ఖజానాను నింపుకొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
గుంటూరులోని పీవీకే నాయుడు మార్కెట్ స్థలాన్ని విక్రయించడానికి జగన్ సర్కార్ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం, గుంటూరుల్లో మొత్తం తొమ్మది ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని విక్రయించడానికి బిడ్డింగ్ను ఆహ్వానించింది ప్రభుత్వం. ఈ ప్రక్రియ ఒకవంక కొనసాగుతుండగా.. మరోవంక భారతీయ జనతా పార్టీ, జనసేన సంయుక్తంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. వైజాగ్ నాట్ ఫర్ సేల్ పేరుతో బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఇప్పటికే ఉద్యమాన్ని చేపట్టారు.
అదే సమయంలో గుంటూరులో జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వర రావు, రమాదేవి వంటి జనసేన నాయకులు 10 రోజులుగా రిలే నిరసన దీక్షలను నిర్వహిస్తున్నారు. వారి దీక్షలు పదోరోజుకు చేరుకున్నాయి.. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ పవన్ కల్యాణ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గుంటూరు జిల్లావాసులతో ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగివున్న పీవీఆర్ మార్కెట్ను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాలనుకోవడం దివాళాకోరు చర్యగా అభివర్ణించారు పవన్ కల్యాణ్.
ప్రజల ఆస్తులను అమ్ముకోవడం అంటే పాలన వైఫల్యమేనని మండిపడ్డారు. పాలన చేతకాకపోవడానికి దీన్ని ఉదాహరణగా తీసుకోవచ్చని ఘాటుగా వ్యాఖ్యానించారు. పెట్టుబడులను తీసుకుని రావడం వల్లే సంపద పెరుగుతుందే తప్ప ఆస్తులను అమ్ముకోవడం వల్ల సాధ్యపడదని హితబోధ చేశారు. సంపదను సృష్టించి, ఉపాధిని కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని, అలా కాకుండా ఉన్న ఆస్తులను అమ్ముకోవడం వాటిపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన వందలాది మంది కుటుంబాలను రోడ్డున పడేయటం సరి కాదని అన్నారు.
ఏపీలో అంతకంతకూ: విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల మరోసారి: రెండువేలకు చేరువగా డిశ్చార్జ్
పీవీకే నాయుడు మార్కెట్పై అయిదువేల మంది ఆధారపడి ఉన్నారని, ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో వారందరూ రోడ్డున పడ్డారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల గల ప్రభుత్వ ఆస్తులను వేలం వేసి విక్రయించిందని, ఫలితంగా తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు ఆ పార్టీ బలి అయిందని అన్నారు. పెట్టుబడులకు గల మార్గాలను అన్వేషించడానికి బదులుగా ఆస్తులను తెగనమ్మి ఏపీ ప్రజల ఆగ్రహానికి గురి కావొద్దని సూచించారు.